చంద్రబాబు మనసులో కోరిక: నెరవేరదని జెసి దివాకర్, జగన్కు ఛాన్స్
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు నీరు వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. దీనిని విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది.
అయితే, పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లు వస్తాయనే విషయంపై టిడిపి నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్ రెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు టిడిపి ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న ప్రయత్నాలు చెబుతున్నారు.
అదే సమయంలో జెసి దివాకర్ రెడ్డి పట్టిసీమ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నది పైన ఎగువన కట్టిన ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కేటాయింపుల్లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతామని చెప్పారు.
రాయలసీమకు నీళ్లు తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, రాయలసీమకు నీరు ఇవ్వాలని ఆయన మనసులో ఉన్న కోరిక అని, కానీ ఆయన కోరిక నెరవేరుతుందన్న నమ్మకం తనకు లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే అలా కనిపిస్తోందన్నారు.
సీమ జిల్లాలకు నీరు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇది తొలి దశ త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం 2016 జనవరిలో పూర్తిస్థాయి ప్రారంభం అవుతుందని చెబుతూ వస్తున్నారు.
అయితే, అల్మట్టీ డ్యాం నిండకుంటే నీరు ఎలా వస్తుందని జెసి దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జలాల వ్యవహారంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన మొదటి నుంచి చెబుతున్నారు.
పట్టిసీమతో ఉపయోగం లేదని, మొదట పోలవరం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు జెసి వ్యాఖ్యలు బాబుకు షాక్ కాగా, జగన్ పార్టీ వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. మరోవైపు, పోలవరం పూర్తయ్యాక పట్టిసీమ అవసరముండదని అంటున్నారు.