నా కొడుకులు కార్లలో స్కూళ్లకు వెళ్తున్నప్పుడు, జగన్కు లేదు: జెసి
తాము కూడా సంపాదించామని, జగన్కు కారు లేనప్పుడు తమ పిల్లలు కార్లలో పాఠశాలకు వెళ్తున్నారని టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు.
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జగన్ పుట్టినప్పటి నుంచి అతని పరిస్థితులు తమకు తెలుసునని ఆయన అన్నారు. తన కుమారులు కార్లలో పాఠశాలకు వెళ్తున్నప్పుడు జగన్కు కారు కూడా లేదని అన్నారు.
అనంతపురం సాక్షి దినపత్రిక ప్రింట్ ఆఫీస్ ఎదుట జేసీ ప్రభాకర్ తన అనుచరులతో ధర్నాకు దిగారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో తమను ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడుతున్నారనే ప్రతిపక్షాల ఆరోపణలపై జెసి సోదరులు స్పందించారు.
ప్రమాదం అనుకోకుండా జరిగిపోయిందని, దానిపై చర్చిద్దాం మృతుల కుటుంబాలకు ఏమైనా చేద్దామనే ఆలోచన తప్పించి అనవసర రాజకీయాలు చేయడం సమంజసం కాదని జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తమ తండ్రి 1952 నుంచి రాజకీయాల్లో ఉన్నారని చెబుతూ అప్పట్నుంచి తాము ఎన్నికోట్లు సంపాదించుండాలని ఆయన అడిగారు.
తమ వృత్తే ఇది అని, ఎమ్మెల్యేను అయినా ఇదే పదవి లేకపోయినా ఇదే సంపాద అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తాము బతుకుదెరువు కోసం సంపాదించుకుంటున్నామని, జగన్ మాదిరిగా దొంగ సూట్ కేసు కంపెన్నీలన్నీ పెట్టి దోచుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
అందర్నీ సెంట్రల్ జైలుకు పంపుతామని జగన్ బెదిరిస్తున్నారని జెసి అంటూ ఆయన పంపించేంది ఏందయ్యా! లా ప్రకారం నాకు శిక్షపడితే జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నోరు తెరిస్తే ముఖ్యమంత్రిని అవుతానని అంటున్న జగన్ పరిస్థితి 2019 తర్వాత ఎలా ఉంటుందో చూడాలని జేసీ అన్నారు.