ముడి పెట్టొద్దు: హోదాపై జెడీ శీలం, చంద్రబాబుకు మహిళల మొర
న్యూఢిల్లీ/గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇతర రాష్ట్రాలతో ముడి పెట్టవద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జెడి శీలం మంగళవారం నాడు రాజ్యసభలో చెప్పారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలన్నారు.
విభజనలో అన్యాయం జరిగినా: చంద్రబాబు
విభజన ద్వారా ఏపీకి అన్యాయం జరిగిందని అయినప్పటికీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలోని వేమూరులో నిర్వహించిన జన చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
టిడిపి బలహీనవర్గాలు, రైతులు, పేదల కోసం పెట్టిన పార్టీ అన్నారు. టిడిపి ఎప్పుడూ ప్రజల్లో ఉంటుందన్నారు. దేశానికి దశ, దిశ నిర్దేశించిన పార్టీ అన్నారు. నూతన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, విభజన తర్వాత ఆదాయం లేదని, అప్పులే మిగిలాయని పేర్కొన్నారు.
పేదల కోసం దూరదృష్టితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దేశంలోనే పేదల కోసం తొలిసారి పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఘనత టిడిపిదే అన్నారు. తాను 2008లో పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేయాలని పద్దతి ప్రకారం పాలన సాగిస్తున్నానన్నారు.
రైతులకు రూ.24వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుంతుందన్నారు. దేశంలోనే ఇలా ఎవరూ చేయలేదన్నారు. 18 నెలల కాలంలో ఎవరూ ఒహించని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
పింఛన్ల కోసం రూ.6వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. రూ.200గా ఉన్నపింఛన్ను రూ.1000 చేశామని, ప్రస్తుతం 44 లక్షల మందికి రూ.వెయ్యి పింఛను ఇస్తున్నామన్నారు. తెలంగాణలో 45 శాతం జనాభా, ఏపీలో 55 శాతం జనాభా ఉంటే అప్పులు, ఆదాయం మాత్రం అందుకు విరుద్ధంగా కేటాయించారన్నారు.
కాగా, చంద్రబాబు వేమూరి ఎస్సీ కాలనీలో ప్రజలతో మాటామంతి జరిపారు. పలువురు చంద్రబాబుకు తమ సమస్యలను విన్నవించారు. బ్యాంకుల్లో వడ్డీ వేయడం లేదని మహిళలు చంద్రబాబు దృష్టిక తీసుకు వెళ్లారు. మధ్యాహ్న భోజనం తీరును పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించారు.
కంటితుడుపు సహాయక చర్యలు: రఘువీరా
వర్షం వల్ల రైతులు అందరూ బాగా నష్టపోయారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మంగళవారం అన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు కేవలం కంటితుడుపు చర్యలే అన్నారు. నిత్యావసర వస్తువులు అందడం లేదన్నారు. టిడిపి సహాయక చర్యల్లోను రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బాధితులు కాంగ్రెస్ వాళ్లయితే పరిహారం ఇవ్వడం లేదన్నారు. టిడిపి చేస్తోంది జన చైతన్య యాత్ర కాదని, జన వంచన యాత్రలు అన్నారు.