కేబినెట్: జూన్ 2 అవతరణ దినోత్సవం, 'తిరుమల'పై ఫైర్
హైదరాబాద్: హైదరాబాదులోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 2వ తేదీన ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 60:40లో భూసేకరణ జరపాలని నిర్ణయించారు.
హుధుద్ తుఫాను కారణంగా ప్రభుత్వ సంస్థలకు రూ.21వేల కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. హుధుద్ తుఫాను నేపథ్యంలో కేంద్రం నుండి భారీగా నష్టపరిహారాన్ని కోరుతూ సెంట్రల్ గవర్నమెంటుకు లేఖ రాయాలని తీర్మానం చేశారు.
అలాగే తిరుమలలో జరిగిన అన్యమత ప్రచారం పైన ఏపీ కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని మతాలను గౌరవిస్తూనే తిరుమల పవిత్రతను కాపాడాలని నిర్ణయించుకుంది. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలని, అలాగే ఇతర మతాలను అదేవిధంగా గౌరవించాలని నిర్ణయించింది.
ధరల నియంత్రణ కోసం మంత్రులు పత్తిపాటు పుల్లారవు, పరిటాల సునీత ఆధ్వర్యంలో నియంత్రణ కమిటీని వేశారు. ఈ భేటీలో ప్రధానంగా శ్రీశైలం జలవివాదంపై చర్చించారు. దీనిపై ఎలాంటి నిర్ణయం వెల్లడికాలేదు. నవంబర్ 1 నుంచి 11 వరకు జన్మభూమి నిర్వహించాలని నిర్ణయించారు.
రాజధానికి భూసేకరణపై ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనల వివరాలను క్యాబినెట్కు తెలిపారు. నవంబర్ 13 నుంచి 15 వరకు మలేసియా, సింగపూర్లో బాబు పర్యటిస్తారు. అనంతరం, నవంబర్ 23 నుంచి 28 వరకు జపాన్లో పర్యటించనున్నారు. కాగా, ఈ భేటీ ఐదు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది.