అదో బానిస బతుకు, అహంకారం: జగన్కు జ్యోతుల సూటి ప్రశ్నలు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ నేతృత్వంలో బానిస బతుకు బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని, అందుకే తాను బయటకు వచ్చి, తెలుగుదేశం పార్టీలో చేరానని ఇటీవల టిడిపిలో చేరిన జ్యోతుల నెహ్రూ చెప్పారు.
తాము కోట్లాది రూపాయలు తీసుకొని పార్టీ మారామని జగన్ చెబున్నారని, జగన్ పార్టీ పెట్టినప్పుడు కూడా మేం మరో పార్టీ నుంచి వచ్చామని, అప్పుడు కూడా జగన్ మాకు కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు.
తమపై విమర్శలు గుప్పించిన జగన్.. తెలంగాణలో వైసిపికి చెందిన ప్రజాప్రతినిధులు తెరాసలోకి వెళ్తే ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వారిని కోట్లాది రూపాయలకు తెలంగాణ సీఎం కేసీఆర్కు అమ్మేశారా అని నిలదీశారు.
తాను జగన్ను ఓ ప్రశ్న సూటిగా అడుగుతున్నానని, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్ కుటుంబం ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత బహిరంగ చర్చకు సిద్ధమా, శ్వేతపత్రం విడుదల చేయగలవా అని సవాల్ చేశారు. జగన్ దగ్గర బానిసల్లా ఉండేవారమని చెప్పారు.
సభలో జగన్ పక్కన కూర్చోవద్దని, అయిదు సమావేశాలలో మూడు సమావేశాల్లో తనను కూర్చోనివ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సీట్లో ఒక్కడే కూర్చుంటారు కాబట్టి తాను ఒక్కడే కూర్చోవాలన్న అహంకారం అని ధ్వజమెత్తారు.