కడప డిసిసిబి మాజీ ఛైర్మన్ బ్రహ్మానందరెడ్డి అరెస్ట్: బస్సు నుంచి దూకిన మహిళా కండక్టర్
కడప: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డిసిసిబి) మాజీ ఛైర్మన్ బ్రహ్మానంద రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సొసైటీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై ఇంతకుముందే కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా దుర్వినియోగంలో బ్రహ్మానందరెడ్డికి కూడా పాత్ర ఉందని తేలడంతో శుక్రవారం క్రితం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
బస్సులో నుంచి దూకిన మహిళా కండక్టర్
పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం నుంచి పట్టిసీమకు వస్తున్న బస్సులో నుంచి మహిళా కండక్టర్ అకస్మాత్తుగా దూకిన ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు బస్సును ఆపిన ఉన్నతాధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఈ సమయంలోనే కండక్టర్ భయంతో దూకినట్లు తెలిసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. కాగా, టికెట్లు మించి ప్రయాణికులు ఉండటంతో తనిఖీ అధికారులు ఆమెపై రిమార్క్ రావడంతోనే ఆమె బస్సులోంచి దూకినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎస్ఐ మృతి
గోదావరి నదిపై ఉన్న నాలుగో వంతెనపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్ఐ శంకర్రావు మృతి చెందారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఏ వాహనం ఢీకొందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై దాడి
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్న తల్లిపైనే కొడుకు కత్తితో దాడి చేసిన దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. తడ మండలం వాతంబేడులో బుజ్జమ్మ అనే మహిళపై అతని కుమారుడు కత్తితో దాడి చేసి గాయపర్చాడు. దీంతో బుజ్జమ్మ పరిస్థితి విషమంగా ఉంది. బుజ్జమ్మను ఆస్పత్రికి తరలించి, కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కుటుంబ కలహాలతో కాకినాడ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు వచ్చి కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి దర్యాప్తు చేస్తున్నారు.