చంద్రబాబును కల్సిన కడియం, 'సినిమా వాళ్లకి తలసాని బెదిరింపు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి కలిశారు. వరంగల్ జిల్లాలోని రేయాన్స్ పరిశ్రమ అంశంపై ఆయన చంద్రబాబును కలిశారని తెలుస్తోంది.
తలసాని, కేసీఆర్లపై ఎర్రబెల్లి నిప్పులు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి తలసాని శ్రీనివాస రావు తదితరుల పైన మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఓ మూర్ఖుడి చేతిలో పెట్టామని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం మొత్తం తెలంగాణ ద్రోహులతో నిండిపోయిందన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కొండా సురేఖ, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు.. ఇలా అందరూ తెలంగాణ ద్రోహులే అన్నారు. సిని కళాకారులను తలసాని బెదిరించారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, తెరాస నేతలు విచ్చలవిడిగా, తెగబడి సంపాదిస్తున్నారన్నారు. తెలంగాణను కాపాడుకోవడానికి కోదండారమ్ ఆధ్వర్యంలో మరో ఐక్యకార్యాచరణ సమితి రావాలన్నారు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను డమాండ్ చేశారు.