కెసిఆర్ నమ్మకాన్ని వమ్ముచేయను: కడియం, అవినీతికి తావులేదు
హైదరాబాద్: తనపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన శుక్రవారం ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తన హయాంలో అవినీతికి, అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు.
కేజీ నుంచి పీజీ వరకు అందించే ఉచిత విద్యపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు కడియం శ్రీహరి వెల్లడించారు. అందరితో చర్చించి కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ముఖ్యమంత్రి సలహాలు, విద్యావేత్తల సహకారంతో సమస్యల్ని అధిగమిస్తామన్నారు.
బంగారు తెలంగాణ కోసం సీఎం కృషి: పద్మా
పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో ఉన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణలో ఏ ఆడబిడ్డ నీళ్లకోసం ఇబ్బంది పడకుండా వాటర్గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించబోతున్నారని చెప్పారు. కళ్యాణలక్ష్మి పథకం అమ్మాయిలకు వరం లాంటిదని తెలిపారు. చెరువులను పునరుద్ధరించి తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయను చేపట్టారని ఆమె పేర్కొన్నారు.