చంద్రబాబు సస్పెన్షన్ నిర్ణయాన్ని సమర్థించిన జగన్ పార్టీ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని సస్పెండ్ చేయడం సరైందేనని, అయితే, ప్రజల దృష్టి మరల్చేందుకే ఆయనపై సీఎం చంద్రబాబు వేటు వేశారని వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని సస్పెండ్ చేయడం సరైందేనని, అయితే, ప్రజల దృష్టి మరల్చేందుకే ఆయనపై సీఎం చంద్రబాబు వేటు వేశారని వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం అన్నారు.
వాకాటిపై కేసుల గురించి, ఆరోపణల గురించి తాము ముందే చెప్పామని, అయినా ఆయనకు టిక్కెటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి రూ.440 కోట్లు అప్పు తీసుకొని ఎగ్గొట్టారన్నారు. చంద్రబాబు చుట్టూ వందల మంది విజయ్ మాల్యాలు ఉన్నారన్నారు.
కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాస రావు, రాయపాటి సాంబశివ రావు, సీఎం రమేష్ తదితరులపై చంద్రబాబు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాకాని ప్రశ్నించారు. అక్రమ కేసులతో ప్రజాప్రతినిధులను భయపెట్టిన ఘనత చంద్రబాబుదన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. సీబీఐ దర్యాఫ్తు చేయించుకొని క్లీన్ చిట్ తెచ్చుకునే ధైర్యం ఉందా అని సవాల్ చేశారు. టిడిపిలో ఆర్థిక నేరాలు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలన్నారు.