కాకినాడ కార్పొరేషన్లో దూసుకుపోతున్న వైసీపీ, వెనుకబడ్డ టీడీపీ, జోరుగా జంపింగ్ లు?
కాకినాడ కార్పొరేషన్లో పాగా వేయాలని వైసీపీ నేతలు కసిగా పని చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. నామినేషన్ల ప్రక్రియకు ముందే ఆ పార్టీ అధిష్ఠానం ఎన్నికలపై సీరియస్గా దృష్టిసారించింది.
కాకినాడ: కాకినాడ కార్పొరేషన్లో పాగా వేయాలని వైసీపీ నేతలు కసిగా పని చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. నామినేషన్ల ప్రక్రియకు ముందే ఆ పార్టీ అధిష్ఠానం ఎన్నికలపై సీరియస్గా దృష్టిసారించింది.
ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరో ముఖ్య నేత బొత్స సత్యనారాయణ ఆదివారం రాత్రి కాకినాడలో ఎన్నికల వ్యూహాలపై అంతర్గత సమావేశం నిర్వహించారు. టీడీపీని దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేశారు.
వెనుకబడిన టీడీపీ?
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతుండగా టీడీపీ వెనుకబడిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియకు ఒకరోజు ముందే టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లను వైసీపీలోకి తీసుకెళ్లడం ద్వారా ఆ పార్టీ నాయకులు ఏ స్పీడులో ఉన్నారో చెప్పకనే చెబుతున్నారు. ఇంకా బయటకు కన్పించని రహస్య వ్యూహాలు అనేకం రూపొందించుకున్నారు. ఈ విషయంలో అధికార టీడీపీ బాగా వెనుకబడిందనే చెప్పాలి. ఏ వ్యూహాలూ లేకుండానే తాము 34 డివిజన్లలో గెలుస్తామంటూ టీడీపీ నాయకులు ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమవుతున్నారు.
మేయర్ అభ్యర్థి కోసం టీడీపీ వేట...
ఎన్నికలకు ముందే వైసీపీ దాదాపు తన మేయర్ అభ్యర్థిని ఖరారు చేశారు. టీడీపీ మాత్రం ఇంకా వెదుకులాటలోనే ఉంది. సామాజికవర్గ సమీకరణలను అంచనాలు వేసుకునే పనిలోనే టీడీపీ నేతలు కాలయాపన చేస్తున్నారు. కాకినాడ సిటీలో ప్రభావిత వర్గాలు, కీలకమైన నాయకులు తదితర అంశాలపై జాబితా రూపొందించే పనిలో ఆ పార్టీ నేతలు తలమునకలై ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఉన్న పట్టు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయడానికి టీడీపీ కసరత్తు చేస్తున్నట్టు కన్పిస్తోంది.
కీలక పోస్టుల్లో కాపు నేతలు...
రాజమహేంద్రవరం మేయర్గా కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ ఉన్నారు. ఈ అంశాన్ని కూడా పార్టీ పరిగణలోకి తీసుకుని.. కాకినాడలో ఏ సామాజికవర్గం వారికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై టీడీపీ నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే తుని, పిఠాపురం, అమలాపురం మున్సిపల్ చైర్మన్లు కూడా కాపు సామాజికవర్గం నుంచే ఉన్నారు. జిల్లా నుంచి కాపు సామాజికవర్గం కోటాలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, లోక్సభలో టీడీపీపక్ష నేతగా తోట నరసింహం ఉన్నారు. ఇటీవల చిక్కాల రామచంద్రరావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ నుంచి.. కాకినాడ సిటీలో రెండు శాతం ఓట్లు కూడా లేని సామాజికవర్గం నుంచి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి వైఎస్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఇలాంటి సంఘటలన్నీ ఇపుడు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ మేయర్ అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేస్తారోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
48 వార్డులకు ఎన్నికలు.. అభ్యర్థుల ఎంపికలో...
కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ టీడీపీ వెనుకబడిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే 30 వార్డులకుపైగా అభ్యర్థుల జాబితా రూపొందించుకున్నట్టు సమాచారం. అచితుచి అడుగేసే ధోరణితో వ్యవహరించడం వల్లనే టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికలో తాత్సారం జరుగుతోంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్నా.. అభ్యర్థుల ఎంపికలో జాప్యంపై టీడీపీ కేడర్ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీ ఇన్చార్జిగా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపైనా టీడీపీలో ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తుంది. అప్పటివరకు పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం కనిపించట్లేదు.
జోరందుకున్న జంపింగ్ లు...
కాకినాడ కార్పొరేషన్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కదనరంగంలోకి దిగుతున్నాయి. అదేక్రమంలో వివిధ పార్టీల్లోకి జంపింగ్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మేయర్ సరోజ టీడీపీలో చేరబోతున్నారు. ఆదివారం ఆమె ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని తునిలో కలిశారు. దీంతో ఆమె ఒకటి రెండురోజుల్లో టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీలో ఆ మధ్య ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో చేరిన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులు, సీనియర్ మాజీ కార్పొరేటర్లు యినుకొండ పట్టాభిరామయ్య, కొలగాని దుర్గాప్రసాద్ తిరిగి ద్వారంపూడి సమక్షంలో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరారు. కాకినాడలో ఆదివారం వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. కాంగ్రెస్, టీడీపీలు కూడా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాయి. అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీల నాయకులు ఆయా పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు.