నాని వ్యాఖ్యలు లైట్: చంద్రబాబును నిలదీసిన కన్నా
భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుంటే ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిచేవారమన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
విజయవాడ: భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుంటే ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిచేవారమన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నాని వ్యక్తిగతమా?.. టీడీపీ అభిప్రాయమా? చెప్పాలని బీజేపీ నేత నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
విజయవాడలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో రాజమండ్రి, తాడేపల్లిగూడెంలో అమిత్ షా పర్యటన సందర్భంలోనూ టీడీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఇప్పుడు విజయవాడ పర్యటన ముందు కూడా తమ పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, కేశినేని నాని వ్యాఖ్యలను తాము లైట్గా తీసుకుంటున్నామని అన్నారు. టీడీపీ నాయకులు అలాంటి వ్యాఖ్యలు చేయగానే తాము ఖండించడం, ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు వారిని దండించడం షరా మామూలేనని అన్నారు. ఇదంతా ఓ నాటకంలా ఉందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
కాగా, పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత చంద్రబాబు వాటిని ఖండించడం పరిపాటిగా మారిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, చాలామంది నేతల పీఠాలు కదిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మే 25న విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల మైదానంలో జరిగే సమావేశాన్ని కార్యకర్తలు జయప్రదం చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు.