ఆనం వర్గీయులపై కన్నబాబు వర్గం ఎటాక్!: రాడ్లతో తల పగలగొట్టారు..
వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లు, రాళ్లతో ప్రత్యర్థులు దాడికి దిగడంతో వెంగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. తలకు రక్తం కారుతుండగానే పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి పడిపోయాడు.
నెల్లూరు: పరిస్థితులు చూస్తుంటే.. ఏపీ రాజకీయాల్లో ఫ్యాక్షన్ తరహా కక్షలు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఒంగోలులో కరణం వర్గీయుల హత్య, కర్నూలు పత్తికొండలో వైసీపీ ఇన్చార్జీ హత్య తర్వాత.. తాజాగా నెల్లూరులోను వర్గపోరు విభేదాలు భగ్గుమన్నాయి.
నెల్లూరు జిల్లాలోని పెద్దబ్బీపురం గ్రామానికి చెందిన ఆనం వర్గీయులపైన కన్నబాబు వర్గీయులైన మాధవరెడ్డి గ్రూప్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో వెంగయ్య అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలు కాగా, పెద్దబ్బీపురం సర్పంచ్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.
పెద్దబ్బీపురంలోని మామిడి తోటల చుట్టూ ఉన్న కరకట్టను కన్నబాబు వర్గీయులు తగలబెట్టడంతో ఈ గొడవ తలెత్తింది. గ్రామానికి చెందిన ఆనం వర్గీయులు అల్లంపాటి సీతారామిరెడ్డి, ఉమ్మడిశెట్టి వెంగయ్యలకు చెందిన ఈ తోటను మంగళవారం ఉదయం మాధవరెడ్డి తదితరులు తగలబెట్టారు.
కరకట్ట కాలిపోతుండటంతో సీతారామిరెడ్డి, ఉమ్మడిశెట్టి వెంగయ్య స్థానిక సర్పంచ్ తగరపు మాలకొండయ్యకు సమాచారం అందించారు. ఆపై ఫైరింజన్ అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేస్తున్న సమయంలో.. ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ బయలుదేరారు. కరకట్ట తగలబెట్టిన విషయంపై కేసు నమోదు చేయాలని భావించారు.
అనుకున్నట్లుగానే సీతారామిరెడ్డి, వెంగయ్య, మాలకొండలు ఒక కారులో ఏఎస్ పేటలోని పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నారన్న విషయం తెలియగానే.. ప్రత్యర్థి వర్గం వారిపై దాడికి ప్లాన్ చేసింది. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ప్రత్యర్థి వర్గం.. సీతారామిరెడ్డి, వెంగయ్య, మాలకొండయ్యలపై దాడికి పాల్పడింది.
వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లు, రాళ్లతో ప్రత్యర్థులు దాడికి దిగడంతో వెంగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. తలకు రక్తం కారుతుండగానే పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి పడిపోయాడు. సర్పంచ్ మాలకొండయ్య స్వల్ప గాయాలతో అక్కడినుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు.
దాడి చేసినవారిలో కన్నబాబు వర్గీయులైన మాధవరెడ్డి, ఊసా మాలకొండయ్య, కొండాస్వామి, బొమ్మినేని, చినవెంగయ్య, నరసయ్య, మధుసూదన్, ఊసా రవి తదితరులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, దాడికి గురైన వ్యక్తులు గతంలోను ప్రత్యర్థులు తమ తోటలను నరికివేసినప్పుడు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీసేందుకే ఒడిగట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, నెల్లూరులో ఆనం బ్రదర్స్ కు, కన్నబాబు వర్గీయులకు మధ్య ఎప్పటినుంచో విభేదాలున్నాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనం వర్గీయులపై కన్నబాబు వర్గీయులు దాడి నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.