తలొగ్గం, చిరంజీవి ఏ ముఖంతో వెళ్తారు: బాబు, దాసరి-మెగాస్టార్లని పోనివ్వం: పోలీస్
విశాఖ: కాపు రిజర్వేషన్ల పైన ప్రభుత్వం వేసిన కమిషన్ నివేదిక ఇచ్చేందుకు మరో ఏడు నెలలు మాత్రమే ఉందని, సమస్యను సంక్లిష్టం చేసుకోవద్దని కాపు నేతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సూచించారని తెలుస్తోంది.
విశాఖలో కేబినెట్ ఉపసంఘం చంద్రబాబుతో భేటీ అయింది. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల పైన కమిషన్ ద్వారానే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరగకుండా ప్రక్రియ పూర్తి చేయాలని, దీనికి సమయం తీసుకుంటుందన్నారు.
ఒత్తిళ్లకు తలొగ్గితే ఇబ్బంది పడతామని మంత్రి వర్గ ఉపసంఘంలో అన్నారని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కాపులను పట్టించుకోని చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి కిర్లంపూడికి వెళ్తానని చెబుతున్నారని, వారు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని ప్రశ్నించారు.
మరోవైపు, ముద్రగడ దీక్షకు కాపుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ముద్రగడ దీక్షకు సంఘీభావంగా రేపు (సోమవారం నాడు) కిర్లంపూడి ఎండీవో కార్యాలయం వద్ద కాపులు నిరసన తెలపనున్నారు.
చిరంజీవి, దాసరిలను విమానాశ్రయాల నుంచే వెనక్కి పంపిస్తాం: పోలీసులు
ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ నేత చిరంజీవి, దాసరి నారాయణ రావులు రేపు కిర్లంపూడికి రానున్న విషయం తెలిసిందే. వారిని పోలీసులు కిర్లంపూడికి వెళ్లనిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చిరు, దాసరిలను కిర్లంపూడికి వెళ్లనివ్వమని, వారిని విమానాశ్రయంలోనే అడ్డుకొని వెనక్కి పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు.
చిరంజీవి సోమవారం మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కిర్లంపూడికి చేరుకుంటారు. అయితే చిరు, దాసరిలను విమానాశ్రయంలోనే అడ్డుకుంటామని పోలీసులు చెప్పడం గమనార్హం.