థ్యాంక్స్.. తిడితే క్షమించండి, మీ కాళ్లు మొక్కుతా: బాబుకు ముద్రగడ
కిర్లంపూడి: కాపులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన రిజర్వేషన్ల హామీ ఆలస్యమైందని అనుమానించి తాను దీక్షకు దిగానని, అంతే తప్ప ముఖ్యమంత్రిని లేదా ప్రభుత్వానని అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం తెలిపారు.
సోమవారం దీక్ష విరమించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు, ఆ తర్వాత చంద్రబాబు పలుమార్లు చెప్పారన్నారు. ఆయన తన హామీని నిలబెట్టుకుంటే తాను ఆయన కాళ్లు మొక్కేందుకు కూడా వెనుకాడనని చెప్పారు.
నా జాతి బాగు కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పారు. కాపులను, కాపు ఉప కులాలను బీసీలలో కలుపుతామని చంద్రబాబు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పలుమార్లు చెప్పారన్నారు. అది ఆలస్యమవుతుందనే తాను దీక్షకు దిగానని చెప్పారు.
తన దీక్షకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. తన జాతికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే తాను దీక్ష చేశానని చెప్పారు. ప్రభుత్వం తరఫున మంత్రులు వచ్చి తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించారని చెప్పారు.
అవమానిస్తే క్షమించండి
కాపుల ఆకలి కేకలు తట్టుకోలేకే తాను దీక్షకు దిగానని చెప్పారు. అంతేగాని ముఖ్యమంత్రిని అవమానించాలనే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదన్నారు. చంద్రబాబును అనరాని మాటలు అంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని నిందించాలనే ఉద్దేశ్యం తనకు ఏ కోశాన లేదన్నారు.
నా జీవితం నా జాతికి అంకితమని చెప్పారు. మా కాపులకు రిజర్వేషన్లు కల్పించగానే నేను మీ ఇంటికి వచ్చి, మీ కాళ్లు మొక్కేందుకు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబును ఉద్దేశించి చెప్పారు. త్వరితగతిన బీసీల్లో చేర్చే విషయమై పూర్తి చేయాలన్నారు.
మాలోని పేదవారికే అన్నం పెట్టమని అడుగుతున్నా
నా జాతికి మేలు చేసి అన్నం పెట్టమని తాను చంద్రబాబును కోరుతున్నానని చెప్పారు. తమ జాతిలోని పేదవారికి మాత్రమే అన్నం పెట్టమని అడుగుతున్నానని, మాలోని డబ్బున్న వాళ్లకు వద్దన్నారు. రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడే ఆ అంశాన్ని అందులో చేర్చుకోవచ్చన్నారు.
ఇతరుల నోటి కాడి ముద్ద మాకు వద్దు
హరిజనులు, గిరిజనులు, బీసీలకు పోను కొంత వాటాను తాము కోరుకుంటున్నామని, మిగతా వారి నోటి ముందు ముద్ద కావాలని మేం కోరుకోవడం లేదన్నారు. మా జాతి కూడా ఇతరుల నోటి ముద్ద అడగదని చెప్పారు.
అందరూ దీక్ష విరమించండి
తనకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది దీక్ష చేశారని, వారందరికీ ధన్యవాదాలు అన్నారు. చంద్రబాబు హామీ ఇచ్చారని, రాష్ట్రవ్యాప్తంగా అందరూ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్లలో చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్న నా జాతి కోసం ఆమోదించానని చెప్పారు.
చంద్రబాబు, జగన్, జేపీలకు ధన్యవాదాలు
తన దీక్షకు ఎందరో రాజకీయ నాయకులు మద్దతు పలికారని, వారందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. చిరంజీవి, రఘువీరా రెడ్డి, జగన్, బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, జయప్రకాశ్ నారాయణ, దాసరి నారాయణ రావు, వట్టి వసంత్ కుమార్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.