రాజ్యసభ సీటు కోసమే అశోక్ బాబు: కారెం శివాజీ
ఎమ్మెల్యేలు వ్యతిరేకించాలి: అశోక్ బాబు
ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఉదయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానంలో జరుగుతున్న మహా సౌరయాగం సందర్భంగా ఆదిత్యునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎపిఎన్జీవో ఎన్నికలు నామమాత్రమే అన్నారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమైక్యాంధ్ర కోసం 28న అన్ని పార్టీలతో భేటీ అవుతామన్నారు.
ఎపిఎన్జీవోల ఎన్నికల్లో ఎవరు గెలిచినా సమైక్య ఉద్యమం ఆగదన్నారు. సమైక్య ఉద్యమానికి, ఎపిఎన్జీవోల ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఎన్నికలయ్యాక అందరం ఉద్యమంలోపాల్గొంటామని చెప్పారు. ఎపిఎన్జీవోల ఉద్యమం వల్లనే తెలంగాణ మూడు నెలలు ఆగిందన్నారు.
సమస్యలపై వినతిపత్రం ఇచ్చా: పురంధేశ్వరి
తెలంగాణ ముసాయిదా బిలలులో లోపాలను రాష్ట్రపతి దృష్టికి తాను తీసుకు వెళ్లానని, సీమాంధ్రకు జరిగే అన్యాయాన్ని రాష్ట్రపతికి వివరించానని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మధ్యాహ్నం ఆమె రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు.
కిరణ్ వ్యతిరేకించడం లేదు: జెసి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని వ్యతిరేకించడం లేదని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ప్రజల అభిప్రాయం తప్పంటే పార్టీని ఎవరూ రక్షించలేరన్నారు. తాను ఇప్పటికీ కాంగ్రెసు పార్టీలోనే ఉన్నానని చెప్పారు.