అనురాధ హత్య: రెండో నిందితుడిని కొట్టి, తిట్టి అవమానించిన మోహన్
చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో రెండో నిందితుడు జిఎస్ వెంకటాచలపతి (51) తనను అవమానించారనే ఆగ్రహంతో కక్ష పెంచుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అనురాధ, కటారి మోహన్ దంపతుల హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.
ఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం - వెంకటాచలపతిది కర్ణాటకలోని కోలార్. గతంలో కర్ణాటక ఆర్టీసిలో డ్రైవర్గా పనిచేశాడు. ఇతను 2007లో అప్పటి చిత్తూరు శాసనసభ్యుడు సికె బాబుపై జరిగిన హత్యాప్రయత్నం కేసులో నిందితుడిగా ఉండడంతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత అనతు తనకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా కటారి మహోన్ను కోరాడు.
అయితే కటారి మహోన్ తనను కొట్టి, తిట్టి అవమానించి తరిమేశాడనే కోపంతో వెంకటాచలపతి చింటూ వద్ద చేరాడు. దీంతో ఆరు నెలల క్రితం చింటూ కటారి దంపతులను హత్య చేయడానికి పథకం వేశాడు. పలుమార్లు ఈ పథకాలు పారలేదు.
చివరకు ఈ నెల 17వ తేదీన అనురాధను, ఆమె భర్త మోహన్ను అతి దారుణంగా హత్య చేశారు. కటారి అనురాధ నుదుటిపై తుపాకీతో కాల్చారు. మోహన్ను వేటాడి కత్తులతో నరికి చంపారు. మేయర్ దంపతులపై దాడి చేసిన తర్వాత వెంకటా చలపతి, చింటూ వద్ద పనిచేసే గంగవరం గ్రామానికి చెందిన టీ. మంజునాథ్ (27), గంగనపల్లెకు చెందిన జయప్రకాష్ (23) అనే వ్యక్తులు తమకు రక్షణ కావాలంటూ పోలీసుల వద్దకు వచ్చారు. మిగిలిన దుండగులు పారిపోయారు.
చింటూతో పాటు మిగిలిన నిందుతులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. కేసు విచారణ చేపట్టిన డిఎస్పీ లక్ష్మీనాయుడు 34 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.