పార్టీతో సంబంధం లేదు: కటారికి జేపీ షాక్, బడ్జెట్ ఓకే
హైదరాబాద్: లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ... కటారి శ్రీనివాస రావు, డీవీవీఎస్ వర్మ, రమేష్ రెడ్డిలకు షాకిచ్చారు. లోక్సత్తా పార్టీతో కటారీ, వర్మలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వారికి ఎలాంటి పదవులు లేవన్నారు. ప్రాథమిక సభ్యత్వం నుండి ఆ ముగ్గురిని పార్టీ తొలగించిందని చెప్పారు. మరోవైపు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాజకీయాన్ని బలోపేతం చేసేలా పార్టీలో సంస్థాగత మార్పులు జరుగుతున్నాయని చెప్పారు.
ఏపీలోని 13 జిల్లాల నాయకులతో జేపీ శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన హామీలను కేంద్రం నుంచి పట్టుబట్టి సాధించుకోవాలన్నారు. లేకుంటే ఆర్థికంగా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగులుతుందన్నారు. కొత్త రాజకీయం కోసం పని చేస్తే ప్రజలు అండగా నిలుస్తారన్నారు. జైట్లీ బడ్జెట్ పైన జేపీ ఫరవాలేదన్నారు.
అసలైన లోక్ సత్తా మాదే
అసలైన లోక్ సత్తా తమదేనని కటారి శ్రీనివాస రావు అన్నారు. నైతిక విలువలు లేని వ్యక్తులు పార్టీలో ఉండేందుకు అనర్హులన్నారు. శ్రీవాస్తవ బృందం అరాచక చర్యల వల్లే పార్టీలో సంక్షోభం తలెత్తిందన్నారు. లోక్ సత్తా పార్టీ జాతీయ కార్యాలయాన్ని శనివారం ఎర్రగడ్డలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.