కావూరి షాక్, బిజెపిలోకి: పాలిటిక్స్కి లక్ష్మీనారాయణ నో
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. దీంతో మోడీ వైపు పలు రంగాల ప్రముఖులు చూస్తున్నారు. ఇందులో భాగంగా కావూరి కూడా బిజెపిలో చేరాలని చూస్తున్నారు. ఆయన శనివారం ఉదయం ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్తో భేటీ అయ్యారు.
రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడాలని కావూరికి రాజ్ నాథ్ సూచించారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర నాయకులు దీనిపై చర్చించి లాంఛనగా ఆయన చేరికను ఆమోదించే అవకాశముందంటున్నారు.కాగా మాజీ డిజిపి దినేష్ రెడ్డి ఇప్పటికే బిజెపి అగ్రనేతలను సంప్రదించారు. దినేష్ రెడ్డి ఒంగోలు నుండి పోటీ చేయాలని చూస్తున్నారు.
బిజెపి, ఎఎపిలో సంప్రదించాయి: లక్ష్మీనారాయణ
తనను బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి)లు సంప్రదించి, పార్టీలోకి ఆహ్వానించాయని సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ ఆదివారం చెప్పారు. అయితే, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని చెప్పారు. బిజెపి, ఎఎపిల ఆహ్వానాలను తాను సున్నితంగా తిరస్కరించానన్నారు. కాగా, లక్ష్మీనారాయణ ప్రస్తుతం థానే జాయింట్ పోలీస్ కమిషనర్గా పని చేస్తున్నారు.