కక్ష సాధింపు చర్య: కేంద్రాన్ని తప్పుపట్టిన కెసిఆర్
హైదరాబాద్: విభజన బిల్లును అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. విభజన బిల్లులోని అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించడం లేదని ఆయన అన్నారు. విభజన బిల్లులోని అంశాలను అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదని ఆయన మండిపడ్డారు.
శనివారంనాడు ఆయన కృష్ణా రివర్ అథారిటీ ఇచ్చిన తీర్పుపై సమీక్ష జరిపారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వర్షాభావం, విద్యుత్తు కొరత కారణంగా రైతులకు చాలినంత విద్యుత్తు అందించలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. రబీ సీజన్లో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల వద్ద విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్తు కొరత నేపథ్యంలో రైతులు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఛత్తీస్గడ్ నుంచి విద్యుత్తు కొనుగోలుపై ఒప్పందం చేసుకోవడానికి ఆయన రేపు ఆదివారం చత్తీస్గడ్ వెళ్లనున్నారు. ఛత్తీస్గడ్ నుంచి తెలంగాణ వేయి మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
తెలంగాణలో విద్యుత్తు వినియోగం బాగా పెరిగిందని ఆయన చెప్పారు. పవర్ గ్రిడ్ నుంచి పెద్ద యెత్తున కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన వాటా 54 శాతాన్ని ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.
శ్రీశైలం జలాల వినియోగంపై కృష్ణా రివర్ బోర్డు ఇచ్చిన తీర్పు సమ్మతం కాదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున తమ అభ్యంతరాలను కృష్ణా జలాల బోర్డుకు నివేదించాలనే యోచనలో ఉంది. దీంతో పాటు న్యాయస్థానంలో ఈ తీర్పును సవాల్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ గర్వించదగిన వ్యక్తి
తెలంగాణ గర్వించదగిన వ్యక్తి ఆళ్వారుస్వామి అని కెసిఆర్ అన్నారు. గ్రంథాలయ ఉద్యమానికి ఆళ్వారు స్వామి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. వట్టికోట శత జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. నగర కేంద్ర గ్రంథాలయానికి ఆళ్వారు స్వామి పేరు పెడుతామని చెప్పారు. గ్రంథాలయ ప్రాంగణం, నకిరేకల్లో ఆళ్వారుస్వామి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.