కెసిఆర్ విస్తరణ: కొత్త మంత్రులు ప్రమాణం, శాఖలు ఇవే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురు చేరారు. వారి చేత గవర్నర్ నరసింహన్ మంగళవారం 11 గంటలకు రాజభవన్లో మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు మొదట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. తుమ్మల నాగేశ్వర రావు ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరారు.
ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపిగా ఎన్నికయ్యారు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నారు. నిర్మల్ స్థానం నుంచి ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంగళవారంనాడు ఉదయమే శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం తరఫున పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. దాంతో రాజీనామా చేసి మంత్రి పదవిని స్వీకరించారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు సార్లు మంత్రిగా పనిచేశారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హోమియోపతి డాక్టర్ అయిన ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రి పదవి చేపట్టడం ఆయన ఇదే తొలిసారి. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.
వరంగల్ జిల్లాకు చెందిన అజ్మీరా చందూలాల్ ఆ తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశఆరు. ఇఁటర్మీడియట్ చదిన ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపిగా గెలిచారు. ఇంతకు ముందు ఓసారి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ శాసనసభ్యుడు జూపల్లి కృష్ణారావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన గతంలో బ్యాంక్ ఉద్యోగి.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావుతో పాటు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరిగింది. జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖను, తుమ్మల నాగేశ్వర రావుకు రోడ్లు భవనాల శాఖను, లక్ష్మారెడ్డికి విద్యుచ్ఛక్తి శాఖను, తలసాని శ్రీనివాస యాదవ్కు వాణిజ్య పన్నుల శాఖను, చందూలాల్కు గిరిజన శాఖను, ఇంద్రకరణ్ రెడ్డికి గృహనిర్మాణ శాఖను కేటాయించారు.