'సెటిలర్స్' కుట్ర! తర్వాత నక్కలంటారు: అందరు కల్సి కేసీఆర్ను ఏకేశారు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైకోర్టు పలుమార్లు మందలించినా కేసీఆర్ ఇంకా తీరు మార్చుకోలేదని, గ్రేటర్ ఎన్నికల కోసమే హైదరాబాదులోని సీమాంధ్రులను తనవాళ్లంటున్నాడని, ఎన్నికలు పూర్తయ్యాక వారినే కుక్కలు, నక్కలు అంటారని వేర్వేరుగా ధ్వజమెత్తారు.
టీడీపీ నేత ఎల్ రమణ మాట్లాడుతూ.. మీడియా పైన సచివాలయంలో ఆంక్షలు సరికాదన్నారు. పలుమార్లు పలు విషయాలలో హైకోర్టు మందలించినా తీరు మారలేదన్నారు. రెండు చానళ్ల ప్రసారాలు నిలిపివేసినప్పుడే కేసీఆర్ నైజమేంటో బయటపడిందన్నారు. ఏ తప్పూ చేయకపోయినా మీడియాను వేధిస్తున్నారన్నారు. చానల్ ప్రసారాలు నిలిపివేసి మిగిలిన చానెళ్లను భయపెట్టాలని చూస్తున్నారన్నారు.
కేసీఆర్ మీడియాను ఆయన అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన పాలన పారదర్శకమనే కేసీఆర్కు ఇప్పుడు మీడియాను చూసి ఎందుకు ఉలికి పడుతున్నారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే సీఎం ఆంధ్రా వాళ్లను పొగుడుతున్నారన్నారు. సెటిలర్ పదం మొదట వాడింది కేసీఆరేనన్నారు. అప్పుడేమో 1956 తర్వాత పుట్టినవారు తెలంగాణలో ఉండొద్దని ఆయన అన్నారని ఇప్పుడేమో మాటమార్చి సెటిలర్ అన్న పదమే ఇక ఉండదంటున్నారన్నారు.
కాలు అడ్డం పెడితే గోదావరి నీళ్లు, రెండు కట్టెపుల్లలు వేస్తే కరెంటు వస్తుందని కేసీఆర్ అన్నారని, ఇప్పుడేమైందని ప్రశ్నించారు. మీడియా స్వేచ్ఛ కోసం టీడీపీ పోరాడుతుందన్నారు. మార్చి 3న కరీంనగర్లో చంద్రబాబు పర్యటన విజయవంతమవుతుందన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసమే హైదరాబాదులోని సీమాంధ్రులు తన వాళ్లని కేసీఆర్ అంటున్నారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
తెలంగాణ ఇచ్చిన సమయం సరైంది కాదు: జానా
వ్యతిరేకుల నోరు మూయించి సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ధైర్యాంగా ఇచ్చారని మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి అన్నారు. సోనియా వల్లే రాష్ట్రం వచ్చిందన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. అయితే తెలంగాణ ఇచ్చిన సమయం సరైంది కాకపోవడం వల్లే పార్టీకి నష్టం జరిగిందన్నారు. హామీల అమలులో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు.
కాంగ్రెస్ను అధికారంలోకి తేవడమే సోనియాకు నిజమైన కృతజ్ఞత అన్నారు. నేతలు విభేదాలు పక్కన పెట్టి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరం కలిసి కృషి చేయాలన్నారు. గ్రెటర్ ఎన్నికల కోసమే కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మాటలు మార్చే వ్యక్తి కేసీఆర్ అని, ఎన్నికలయ్యాక ఆయన మళ్లీ తిట్ల దండకం అందుకుంటారన్నారు.
కేబినెట్లో సగం మంది తెలంగాణ వ్యతిరేకులే ఉన్నారన్నారు. మాట మార్చే నేత, మూఢనమ్మకాల సీఎంకు ప్రజలే నిరసన తెలుపుతున్నారన్నారు. నేతలకు వ్యక్తిగత అభిప్రాయం ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అందరూ కలిసి చేసుకుందామన్నారు.
మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ను సీమాంధ్రులు నమ్మవద్దన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసమే సెటిలర్స్ పదం వద్దని అంటున్నారని, అసలు ఆ పదం వాడిందే ఆయన అన్నారు. ఎన్నికలయ్యాక కుక్కలు, నక్కలు అంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వలలో ఎవరు పడవద్దన్నారు. కాంగ్రెస్ క్యాడర్ను వేధిస్తే పోలీసు స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలన్నారు.
సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కారకురాలు సోనియానేనని డీ శ్రీనివాస్ అన్నారు. ఎన్నో దశాబ్దాల పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాకారమైందన్నారు. పార్టీలో సానుకూలత వచ్చేలా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన ఘనత సోనియాదే అన్నారు.
వాస్తవం లేదు: మురళీధర రావు
ఎన్డీయేలో తెరాస చేరుతుందన్న వార్తలను మీడియాలోనే చూస్తున్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు వేరుగా తెలిపారు. తెరాస చేరికపై పార్టీలో ఎటువంటి చర్చ జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగానే పోరాడతామన్నారు.