పవన్ ప్రభావం ఉండదు, సర్వేలో జగన్కే 45 శాతం: కేసీఆర్ సంచలనం, ఏపీ కుల రాజకీయాలపై..
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రభావం ఉండకపోవచ్చునని చెప్పారు.
హైదరాబాద్/న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రభావం ఉండకపోవచ్చునని చెప్పారు.
చదవండి: నంద్యాల ఎందుకు 'కీ'లకం, ఏపీలో పెను మార్పులు: వీరందరికీ సవాల్
చిరంజీవి పార్టీని విలీనం చేసి కట్టెల మోపు దింపుకున్నారని, తాను పార్టీని నడుపుతున్నానని చెప్పారు. తాను అమరావతి వెళ్లినప్పుడు ప్రాజెక్టులపై దృష్టి సారించమని చంద్రబాబుకు చెప్పానని తెలిపారు. ఏపీతో పెద్దగా విభేదాల్లేవన్నారు.
పీఆర్పీని చూశాం, పవన్ కళ్యాణ్ చేతులు ఊపితే ఓట్లు రాలుతాయా
కేసీఆర్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ప్రభావం అంతగా ఉండదని వ్యాఖ్యానించారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఏమయిందో అందరికీ తెలుసునని, అది ఏమయిందో అందరూ చూశారన్నారు. ఓ పార్టీని నడిపించడం అంటే అంత చిన్న విషయం కాదని కేసీఆర్ చెప్పారు. పవన్ చేతులు ఊపితే ఓట్లు రాలుతాయా అని ఎద్దేవా చేశారు.
Recommended Video
రాజకీయ మిత్రుడి సర్వేలో ఏపీలో బలాబలాలు.. పవన్ బలం అంతే
ఏపీలో తనకు తెలిసిన రాజకీయ మిత్రుడు ఒకరు సర్వే చేసారని, వైసిపికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తన మిత్రుడి సర్వేలో వైసిపి వైపు 45 శాతం మంది, టిడిపి వైపు 43 శాతం మంది, బిజెపి వైపు 2.6 శాతం మంది, పవన్ వైపు 1 శాతం మంది మొగ్గు చూపుతున్నారని తేలిందన్నారు.
బిజెపికి కేసీఆర్ ఝలక్, కేబినెట్లో చేరం
ఏపీలో బిజెపి అడుగు పెట్టాలని చూస్తోందని, అందుకే కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోందని కేసీఆర్ చెప్పారు. అయితే, దక్షిణాదిన బలపడటం బిజెపికి సాధ్యం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.
ఏపీలో కుల రాజకీయాలు
తెలంగాణలో కుల రాజకీయాలు లేవని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రాలు కుల రాజకీయాలు ఇప్పట్లో వీడవన్నారు. కాపుల సామాజిక వర్గం ఏపీలో చాలా బలంగా ఉందన్నారు. శాఖలుగా, వర్గాలుగా కాపులు ఉండటంతో వారిలో ఐక్యత లేదన్నారు. వారంతా ఏకమైతే అక్కడ రాజకీయ పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు.
వేర్వేరు గవర్నర్లు, అసెంబ్లీ సీట్లు పెరగకపోవచ్చు
ఏపీ, తెలంగాణలకు వేర్వేరు గవర్నర్లు వచ్చే అవకాశముందని కేసీఆర్ చెప్పారు. ఏపీకి ఆనందీబెన్, తెలంగాణకు శంకరమూర్తి వచ్చే అవకాశముందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అసెంబ్లీ సీట్లు పెరగకపోవచ్చునని ఇభిప్రాయపడ్డారు. ఇప్పుడు చట్టం చేసినా ఐదేళ్లు పడుతుందని ప్రధాని మోడీ చెప్పారన్నారు. ఇప్పుడు లేనట్లే అన్నారు. నియోజకవర్గాల పెంపు తమకు ప్రాధాన్యం కాదన్నారు.