కేసీఆర్తో కుమ్మక్కు, జగన్పార్టీ ఖాళీ: మోడీకి చెప్తామని
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కు కావడం వల్లే పరస్పరం విమర్శలు చేసుకోవడం లేదని, జగన్ పార్టీ ఖాళీ అవుతుందని తెలుగుదేశం విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు బుధవారం అన్నారు.
జనవరిలోపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పారు. జగన్ ఆస్తుల విషయమై తాము త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పారు. జగన్ ఆస్తులు జఫ్తు చేయాలని కోరుతామన్నారు. జగన్ ఆస్తులు వేలం వేయాలన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ చురుకుగా వ్యవహరిస్తే 2015లో అతడు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. దర్యాప్తు వేగవంతంపై ప్రధానిని కలుస్తామని, అవసరమైతే సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.
శ్రీశైలంలో జలవిద్యుత్తో రాయలసీమకు తాగునీటి కష్టాలు తప్పవన్నారు. జగన్ కుటుంబమంతా కేసీఆర్కు దాసోహం అవడం వల్లే రాయలసీమ ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయలసీమ ప్రజలు జగన్ను నిలదీయాలన్నారు. కేసీఆర్ ఇంటి ఎదుట జగన్ ధర్నా చేయాలని డిమాండ్ చేశారు.
సర్వేల పేరుతో మోసం: ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచి అయినా అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయిస్తామని తెలంగాణ టీడీపీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా అన్నారు. హైదరాబాదులోని షేక్పేట తహసీల్దారు కార్యాలయం వద్ద బుధవారం టీడీపీ ధర్నా చేపట్టింది.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు. సర్వేల పేరుతో అర్హులకు పింఛన్లు తొలగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. సర్వేల పేరుతో ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందన్నారు.
కేంద్రంతో తెలంగాణ సంబంధాలపై కోదండరామ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఛైర్మన్ కోదండరాం వేరుగా ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సంబంధాలు పెట్టుకుంటేనే లబ్ధి ఉంటుందన్నారు. కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం సత్సంబంధాలు నెరపకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్ పాలకులే కారణమన్నారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రా పాలకులు పట్టుకుపోయారని ఆరోపించారు.
సోనియాను కలిసిన పొన్నాల
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని బుధవారం ఉదయం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కలిశారు. ఆయన తాజా రాజకీయ పరిణామాల పైన సోనియాకు వివరించారు.