మీరు ఇచ్చేస్తే, మేం ఇది ఇస్తాం: బాబుకు కేసీఆర్, చర్చించనున్న ఏపీ కేబినెట్
హైదరాబాద్: హైదరాబాదులోని ఏపీ సచివాలయం ఖాళీ అయింది! ఏపీ దాదాపు నవ్యాంధ్ర రాజధాని నుంచి పరిపాలన సాగిస్తోంది. ఈ నేపథ్యంలో సెక్రటరియేట్ ఖాళీ అయింది. దీనిని తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ సిద్ధంగా ఉంది. అదే సమయంలో దానిని తమకు అప్పగిస్తే తాము మరోచోట సచివాలయంకు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను తమకు అప్పగిస్తే ప్రత్యామ్నాయంగా శాసనసభకు సమీపంలోని హెర్మిటేజ్ భవనాన్ని ఏపీకి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనికి సంబంధించి గవర్నర్ నరసింహన్కు, ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆదర్శ నగర్కు వెళ్లే దారిలో హెర్మిటేజ్ భవన సముదాయం ఉంది. ఆరు అంతస్థులతో దాదాపు లక్ష అడుగుల నిర్మాణస్థలం ఉంది.
అందులో గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని సెర్ప్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలు ఉన్నాయి. పార్కింగ్ ఇతర వసతులున్న ఈ భవనాన్ని ఏపీ సచివాలయానికి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. గవర్నర్ ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వానికి పంపించారు. ఈ నెల 31వ తేదీన ఏపీ మంత్రి మండలి సమావేశం జరగనుంది. తెలంగాణ చేసిన తీర్మానంపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు.