'కేసీఆర్ మైండ్ గేమ్', చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెస్ ధ్వజం
కరీంనగర్/అనంతపురం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మైండ్ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఉప నేత జీవన్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేక అరాచక పాలనా చెప్పాలని ప్రశ్నించారు.
అవినీతిని సహించబోమన్న ప్రభుత్వానికి ఇసుక మాఫియా కనిపించడం లేదా అని నిలదీశారు. అధికారికంగా ఇసుకను వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం, అవినీతిని ప్రోత్సహించడమే అవుతుందని దుయ్యబట్టారు. ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిని ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని, చంద్రన్న సంక్రాంతి కానుకల్లో రూ.80 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దివంగత వైయస్ అపర భగీరథుడు కనుకే జలయజ్ఞాన్ని చేపట్టారన్నారు. చంద్రబాబు మోసానికి, వంచనకు మారుపేరన్నారు.
పట్టుసీమ వల్ల ప్రాంతీయ విబేధాలు: మైసూరా
పట్టుసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రాంతీయ విబేధాలకు ప్రభుత్వం భీజం నాటే ప్రయత్నం చేస్తోందని వైసీపీ నేత మైసూరా రెడ్డి అన్నారు. పట్టుసీమ ఎత్తిపోతల పథకం వల్ల పోలవరం ప్రాజెక్టు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. కాంట్రాక్టర్లకు జేబులు నింపేందుకు పట్టుసీమను ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు.