నేను 3 పనులు చేయాలి: కేసీఆర్, హరీష్కు ప్రశంస, హెలిప్యాడ్ వద్ద అపశృతి
మెదక్: సిద్దిపేటకు తాను మూడు పనులు ముఖ్యంగా చేయాల్సి ఉందని, ఈ గడ్డ పైన ఎందరో ఆణిముత్యాలు ఉన్నారని, అలాంటి ఆణిముత్యాలలో మంత్రి హరీష్ రావు ఒకరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో వాటర్ గిర్డి సమీక్ష అనంతరం కేసీఆఱ్ సిద్దిపేట సర్వెంట్స్ హోం స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఈ భవనం నుండి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చానో తనకే గుర్తుకు లేదన్నారు. నేను మీరు పెంచి పోషించిన బిడ్డను అని చెప్పారు. నియోజకవర్గానికి మొత్తానికి నీళ్లు అందించిన సిద్దిపేట తెలంగాణ వాటర్ గ్రిడ్కు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్వెంట్స్ హోం అభివృద్ధికి రూ.50వేలు మంజూరు చేశారు.
తాను సిద్దిపేటకు మూడు పనులు చేయాల్సి ఉందని చెప్పారు. సిద్దిపేటను జిల్లాగా మారుస్తామన్నారు. సిద్దిపేటకు రైల్వే లైను తెస్తామని చెప్పామని, ఆ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. రైల్వే లైను కోసం రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు కేటాయిస్తుందన్నారు. అలాగే సిద్దిపేటకు సాగునీరు అందించాల్సి ఉందని చెప్పారు.
తడకపల్లి రిజర్వాయర్ ద్వారా సిద్దిపేటకు సాగునీరు అందిస్తానని చెప్పారు. ఐదేళ్లలో ఇంటింటికి నీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పారు. బంగారు తెలంగాణను సాధించి దేశానికే ఆదర్శంగా నిలుద్దామన్నారు. తెలంగాణకు నిధుల కొరత, టెక్నాలజీ కొరత లేదన్నారు.
ఎంత ఖర్చైనా వాటర్ గ్రిడ్ నిర్మిస్తామని చెప్పారు. సిద్దిపేటలో ఎందరో ఆణిముత్యాలు అని, వారిలో హరీష్ రావు ఒకరు అన్నారు. వాటర్ గ్రిడ్ కోసం తాము ఎంత కష్టపడ్డామో ప్రభుత్వ ఇంజనీర్లు కూడా అదే తరహాలో కష్టపడాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు ఇంజినీర్ల సమీక్షలో మాట్లాడుతూ.. ఇంజినీర్ల జేబులో 24 గంటలు కాంటూర్ బుక్ ఉండాలని కేసీఆర్ సూచించారు. ఇంజినీర్లు చెమట చుక్కలు రాలిస్తేనే ప్రజలకు నీటి చుక్కలు వస్తాయన్నారు. టెక్నాలజీ, నిధులకు బాధ లేదన్నారు. ఏం కావాలన్నా డబ్బులకు వెనుకాడమన్నారు.
వాటర్ గ్రిడ్ పథకం అనుకున్న సమయానికి పూర్తి చేసి ఆదర్శమవుదామన్నారు. ఇంజినీర్లు తలుచుకుంటే వాటర్ గ్రిడ్ అసాధ్యం కాదన్నారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని 90 శాతం తానే డిజైన్ చేశానని చెప్పారు. పదిశాతం ఇంజినీర్ల సహకారం తీసుకున్నామన్నారు. తెలంగాణ వాటర్ గ్రిడ్ అత్యంత ప్రాధాన్య పథకమన్నారు.
అంతకుముందు కోమటిచెరువు ఆధునికీకరణకు శంకుస్థాపన చేశారు. 6.8 కోట్లతో చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే చెరువు సుందరీకరణ పనులు చేపడతామన్నారు. నాలుగేళ్లలో వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
స్వల్ప అపశృతి
కేసీఆర్ పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. కేసీఆర్ రాక నేపథ్యంలో అభిమానులు టపాకాయలు కాల్చారు. దీంతో కింది గడ్డి అంటుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. సిబ్బంది వాటిని ఆర్పాయి.