అందరు మాట్లాడుకునేలా, అందుకే ప్రధాని: మోడీపై కేసీఆర్ ప్రశంసలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీకి కితాబిచ్చారు. గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేసిన మోడీ మంచి పారిశ్రామిక విధానాలను తీసుకు వచ్చారని, పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలు కల్పించారని కేసీఆర్ శాసన సభలో గురువారం అన్నారు. తన పాలన కారణంగానే మోడీ ప్రధాని అయ్యారని అందరు అంటున్నారన్నారు.
ఎక్కడకు వెళ్లినా గుజరాత్ పరిశ్రమల పైన మాట్లాడుకునేలా చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల పారిశ్రామికవేత్తలను తాము ప్రోత్సహిస్తామని చెప్పారు. మాజీ మంత్రి గీతా రెడ్డి మంచి సూచనలు, సలహారు ఇచ్చారని కొనియాడారు. చట్టం వచ్చాక అనేక నిబంధలను ఖరారవుతాయన్నారు.
రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని గొప్పగా అమలుచేసి చూపిస్తామని చెప్పారు. బిల్లును సభ్యులు అందరు ప్రోత్సహించడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం తీసుకు వస్తున్న పారిశ్రామిక విధానంలో పారదర్శకత ఉంటుందన్నారు. సభ్యులంతా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలని కోరారు.
అంతకుముందు గీతా రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాదును మంచి పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. తాము బంగారు తెలంగాణ తెచ్చామని, దానిని వజ్రాల తెలంగాణగా తయారు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తాము వేసిన పునాదుల పైన కొత్త ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి సాధించాలన్నారు.
గతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనేక రాయితీలు ఇచ్చామన్నారు. ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించామన్నారు. ఐడీపీఎల్ వల్ల బల్క్ డ్రగ్లో నెంబర్ వన్గా ఉన్ామని, ఐటీ పార్కు, ఇంకా ఎన్నో సంస్థలు హైదరాబాదులో ఉన్నాయన్నారు. ఎస్సీలు ముందుకు వచ్చేందుకు జిల్లాల్లో అవగాహన సదస్సులు పెట్టాలని, ఎస్సీల పేరుతో బినామీ లు రాకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.
గతంలో భూకేటాయింపుల్లో అనేక పొరపాట్లు జరిగాయని, ఏ అవసరం కోస భూమి తీసుకుంటున్నారో ప్రభుత్వం పర్యవేక్షించాలని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకయ వీరయ్య అన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. బడుగు, బలహీన వర్గాల్లోని పారిశ్రామికవేత్తలను కూడా ప్రోత్సహించాలన్నారు.