కారు దిగగానే, ఫర్వాలేదన్నారు: వైయస్ స్కీం భేష్ అన్న కేసీఆర్
హైదరాబాద్: గుజరాత్ పారిశ్రామిక విధానం పైన శాసన సభలో గురువారం నాడు నరేంద్ర మోడీకి ప్రశంసలు గుప్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి కూడా కితాబిచ్చారు. వైయస్ హయాంలో కొన్ని సేవలు అద్భుతమని కేసీఆర్ కొనియాడారు.
ముఖ్యంగా 108 అంబులెన్స్ సేవలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది ప్రాణాలను కాపాడాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు, తాను ఒకసారి వరంగల్ జిల్లా పరకాల వెళుతుండగా.. రోడ్డు ప్రమాదంలో ఓ మనిషి చావుబతుకుల మధ్య ఉండడంతో, తానూ కారు దిగానని చెప్పారు.
కానీ, అక్కడున్న పిల్లలు... ఏం ఫర్వాలేదు, 10 నిమిషాల్లో 108 వస్తుందని చెప్పారని కేసీఆర్ సభలో చెప్పారు.జనంలో 108 పట్ల ఉన్నవిశ్వాసాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. కాగా, గురువారం నాడు పారిశ్రామిక విధానంపై మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు కూడా మంచి పారిశ్రామిక విధానం కోసం ప్రయత్నించాయన్నారు.
అంతకుముందు, కేసీఆర్ మాట్లాడుతూ.. నాలుగేళ్లు పూర్తయ్యే సరికి తెలంగాణ రాష్ట్రంలోని డ్రింకింగ్ వాటర్ గ్రిడ్తో ప్రతి ఇంటికీ నీరు అందిస్తామని తెలిపారు. వాటర్ గ్రిడ్ ద్వారా నీరు అందించలేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లడగబోమన్నారు.
వాటర్ గ్రిడ్కు అవసరమైన నిధుల కోసం ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నామని చెప్పారు. చిత్తశుద్ధితో కష్టపడుతున్నామన్నారు. మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణ చేపడతామన్నారు. రహదారుల అభివృద్ధికి రూ.15వేల కోట్లు కేటాయించామన్నారు. వ్యవసాయానికి తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.