హైదరాబాద్కు ఆ ఘనత: ఎన్నారైలకు కేసీఆర్ పిలుపు
హైదరాబాద్: 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, దేశంలోనే మన ఐటీ రెండోస్థానంలో ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం శాసన సభలో అన్నారు. పారిశ్రామిక విధానం బిల్లును ఆయన ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో పోటీ నెలకొందన్నారు. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాదుకు క్యూ కడుతున్నాయన్నారు. దేశ, విదేశాల్లోని విధానాలను అధ్యయనం చేసి, పారిశ్రామికవేత్తలు, అన్ని వర్గాలకు చెందిన వారి సూచనలు పరిగణలోకి తీసుకొని చట్టం రూపకల్పన చేశామన్నారు. పరిశ్రమల కోసం మన వద్ద 30 లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. ప్రాజెక్టుల నుండి పది శాతం నీటిని పరిశ్రమలకు ఇస్తామన్నారు.
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలన్నారు. హైదరాబాదులో పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందన్నారు. హైదరాబాదు సమాజం అందరినీ అక్కున చేర్చుకుంటుందన్నారు. తాము రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం ప్రవేశ పెట్టామన్నారు. గత ప్రభుత్వాలలోని సింగిల్ విండో విధానాలు అనుకున్న స్థాయిలో సఫలం కాలేదన్నారు. ఇప్పుడు గ్రిల్స్ లేకుండా సింగిల్ విండో విధానం ఉంటుందన్నారు.
వజ్రాల వ్యాపారాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. హైదరాబాదులో కాస్మోపాలిటన్ కల్చర్ ఉందన్నారు. వరంగల్ పట్టణాన్ని గుజరాత్లోని సూరత్కు ధీటుగా టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. రక్షణ రంగంలో 49 శాతం ఎఫ్డీఐలకు అవకాశం కల్పించడంతో హైదరాబాదు కీలకపాత్ర పోషించనుందన్నారు. అగ్నిలాంటి క్షిపణి తయారీలో చేసిన ఘనత హైదరాబాదుకు దక్కిందన్నారు.
గత ప్రభుత్వాలు రూ.600 కోట్ల బకాయిలు పెట్టాయని, రూ.522 కోట్ల బకాయిలు తాము చెల్లిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఎన్నారైలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, పెట్టుబడులు పెట్టేందుకు రావాలన్నారు. రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలంటే ముఖ్యంగా భూమి, నీరు, విద్యుత్ కావాలన్నారు. గత ప్రభుత్వాలు కూడా పరిశ్రమల అభివృద్ధికి పని చేశాయన్నారు.
చర్చోపచర్చల అనంతరం బిల్లు రూపొందించినట్లు చెప్పారు. పారిశ్రామిక విధానాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారన్నారు. దేశవిదేశాలు, ఇతర రాష్ట్రాల నుండి చాలామంది పారిశ్రామికవేత్తలు వచ్చి విధానం పైన చెప్పారన్నారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా పవర్ డిస్కం పెడతామన్నారు. కాగా, దీని పైన చర్చ అనంతరం కొత్త పారిశ్రామిక విధానానికి శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించిన అందరికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.