వారి కళ్లలో కోటి రూపాయల ఆనందం చూశా: కెసిఆర్
హైదరాబాద్ : హైదరాబాద్కు మంచి అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో ఆయనప్రసంగించారు. హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దుకోబోతున్నామని తెలిపారు. నగరంలోని 2 లక్షల మందికి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఉద్ఘాటించారు.
మొన్న తాను ఐడీహెచ్ కాలనీకి పోయినప్పుడు అక్కడి ప్రజల కళ్లలో కోటి రూపాయాల ఆనందం చూశానని చెప్పారు. అక్కడ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే పేదలందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. పేద ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల్లో చిన్న స్ఫూర్తి కలిగిస్తే ఇక రగిలిపోతారని అన్నారు. హైదరాబాద్ ఎటు పడితే అటు పెరిగిందని చెప్పారు. హైదరాబాద్కు దేన్ని అతికించాలి.. దేన్ని విడిపించాలనే అంశంపై మాస్టర్ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
హరితహారంగా తెలంగాణను మార్చడానికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్వచ్ఛ జూన్ నెలలో హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 3 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ హరితహారాన్ని బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఎవరి ఇండ్ల వద్ద వారు మొక్కలు నాటుకోవాలని, ఇండ్ల వద్ద విశాలమైన స్థలం ఉంటే రెండు మూడు మొక్కలు నాటుకోవాలని సూచించారు. హరితహారం వల్ల మేలు జరుగుతుందే తప్ప నష్టం లేదన్నారు. హరితహారంపై కళాబృందాలు చైతన్యం కల్పిస్తాయన్నారు.
రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈమేరకు ఇవాళ హోటల్ నోవాటెల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మే 16 నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని కెసిఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఎవరికి ఏ ఏరియా కేటాయించింది మే 10 లోపు తెలుస్తుందన్నారు. అందరం కలిసి ఆ రోజు ఇక్కడ నుంచి స్పాట్ కు వెళ్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 35,835 మంది కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.
సూరత్ ఒకనాడు ఎంతో మురికిగా ఉండేదని కానీ ఇవాళ వాళ్లు చేసుకోన్న కృషి ఫలితంగా ఎంతో అద్భుతమైన సిటీగా మారిందన్నారు. హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ తరహా సిగ్నలింగ్ వ్యవస్థతో తీర్చి దిద్దుతామన్నారు. అవసరమైతే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక్కో టీమ్ కు రూ.50 లక్షలు ఇస్తామని తెలిపారు.
మనం ఇవాళ చెత్తలో మురికిలో పెట్టి అమ్ముతోన్న కూరగాయలు, మాంసం కొంటోన్న దుస్థితిలో ఉన్నామని చెత్తా చెదారంలో జీవిస్తున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితి పోవాలని అన్నారు. ఇందు కోసం మనమంతా నగరాన్ని పరిశుభ్ర నగరంగా మార్చుకోవాలని అన్నారు. సరైన కూరగాయల మార్కెట్లు, మాంసం మార్కెట్లు ఉండాలన్నారు.