ఇవ్వండి.. బాబు ఇవ్వట్లేదని మీకు తెల్సు: మోడీకి కేసీఆర్ 2 లేఖలు
హైదరాబాద్: తెలంగాణకు మరింత విద్యుత్ ఇవ్వాలని, తూర్పు గ్రిడ్ నుండి 500 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అలాగే రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు క్షేత్రాలు కేటాయించాలని మరో లేఖ రాశారు. వచ్చే ఐదేళ్లలో బొగ్గు అవసరాలను అందులో వెల్లడించారు. అజ్మీర్లో స్థలం కేటాయించారని రాజస్థాన్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
రాష్ట్రంలో ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను అధిగమించడానికి ఈస్ట్రన్ పవర్ గ్రిడ్ నుంచి మిగులు విద్యుత్ను తెలంగాణకు కేటాయించాలని కేసీఆర్ ప్రధాన మోడీని కోరారు. తమ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటుందని, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించిన మేరకు ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వని విషయం మీకు తెలియనిది కాదని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
అలాగే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఉల్లంఘించిందని, ఇరు రాష్ట్రాల విద్యుత్ పంపిణికి కేంద్ర ఇంధనశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ అది ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో వచ్చే నాలుగు నెలలలో తమ రాష్ట్రం మరింత విద్యుత్ సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందని కేసీఆర్ఆందోళన వ్యక్తం చేశారు.
తమ రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్య నుంచి గట్టేక్కించడానికి ఈస్ట్రన్ పవర్ గ్రిడ్ నుంచి 500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు గనులను కేటాయించాలని ముఖ్యమంత్రి మరో లేఖలో ప్రధానిని కోరారు. కాకతీయ థర్మల్ విద్యుత్ రెండవ దశ ఈ ఏడాది మధ్యలో ప్రారంభం కాబోతుందని, దీనికి గతంలో కేటాయించిన బొగ్గు నిలువలను పునరుద్ధరించాలన్నారు.
ఈ థర్మల్ విద్యుత్ కేంద్రానికి గతంలో తాడిచర్ల కోల్ బ్లాక్ నుంచి కేటాయించిన బొగ్గును సుప్రీంకోర్టు రద్దు చేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. అలాగే సింగరేణి కాలరీస్ డిసెంబర్ నాటికి 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మిస్తున్న రెండు విద్యుత్ కేంద్రాలతో పాటు భవిష్యత్లో ఏర్పాటు కానున్న మరో 600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కోసం మొత్తంగా తొమ్మిది మిలియన్ టన్నుల బొగ్గు అవసరం అవుతుందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించడానికి వచ్చే నాలుగు సంవత్సరాలలో 4,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తుందని, వీటి కోసం కూడా 21 మిలియన్ టన్నుల బొగ్గు కేటాయించాలని కోరారు. రాజస్థాన్ సీఎంకు రాసిన మరో లేఖలో అజ్మీర్లోని హజరత్ ఖాజా మోయినుద్దీన్ ఛిస్తీ ఘరిబ్ నవాజ్ వద్ద అతిథి గృహాన్ని నిర్మించేందుకు రెండు ఎకరాల భూమి ఇవ్వాలని వసుంధరా రాజేకు లేఖ రాశారు.