ఒంటిమిట్టలో కేఈ, రామతీర్ధంలో మాణిక్యాలరావు
ఒంటిమిట్ట: ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుతోంది. ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరుపున డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్వామి వారికి ప్రభుత్వం పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్ర్తాలు, ముత్యాలతలంబ్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
రాజధాని ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లాగా, రాజధానికి అమరావతిగా పేరును సూచిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పట్టిసీమ పూర్తైతే రాయసీమలో ఏడాదికి మూడు పంటలు పండుతాయని కేఈ కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా వేకువజామునుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తలు తరలివస్తున్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తోక్కిసలాట కాకుండ బారీకేడ్లను ఏర్పాటు చేశారు. కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం రెండు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీటి సమస్య రాకుండా ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు ప్రత్యేక చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఇప్పటికే రూ. 10 కోట్ల నిధులను విడుదల చేసింది. ఒంటిమిట్ట ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరగనున్నాయి.
ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పూజలు, వేడుకలు, కీర్తనలు, సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, తదితర కనువిందు చేసే కార్యక్రమాలతో పాటు ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక అలంకారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఒంటిమిట్టలో తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచే భక్తులు స్వామిని దర్శించుకునే వీలు కల్పించారు.
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి మాణిక్యాలరావు
విశాఖపట్నంలోని అంబికాబాగ్ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్ధం ఆలయంలో సీతరాముల కళ్యాణం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారకంగా నవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. మంత్రి మాణిక్యాలరావు, మరో మంత్రి మృణాళిని ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రామతీర్థం అభివృద్ధికి రూ. 1.7 కోట్లను కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు.
శ్రీరామనవమి సందర్భంగా వేకువజామునుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తలు తరలివస్తున్నారు. రామతీర్ధాన్ని రెండో భద్రాచలంగా పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.