ఆస్తులు రక్షించుకునేందుకే కెసిఆర్కి పొగడ్త, ఆర్నెల్లకోసారొస్తావ్: పవన్పై నాని తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని తన ఆస్తులను కాపాడుకునేందుకు, తన సినిమాలు నడిపించుకునేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తమ ఆత్మాభిమానాన్ని కెసిఆర్ పాదాల వద్ద తాకట్టు పెడితే ఊరుకునేది లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.
మంగళవారం సాయంత్రం కేశినేని నాని, కొనకళ్ల నారాయణలు పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ ప్రశంసలు తమకు అవసరం లేదని కొనకళ్ల అన్నారు. దయచేసి హద్దుల్లో ఉండాలన్నారు. ఓ మిత్రపక్షంతో ఎలా ఉండాలో నేర్చుకోవాలని హితవు పలికారు.
ప్రత్యేక హోదా పైన మేం పోరాడుతూనే ఉన్నామని చెప్పారు. సీమాంధ్ర ఎంపీలం ఇప్పటి వరకు రూ.6,500 కోట్లు తెచ్చామన్నారు. హోదాపై తమతో కలిసి రాకుండా తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నించారు. పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.
కేశినేని నాని మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ఆరు నెలలకు ఓసారి సింహం జూలు విదిల్చినట్లు విధించి ఏదో ఒకటి మాట్లాడుతుంటారని, ఆ తర్వాత మళ్లీ నిద్రలోకి వెళ్లిపోతారన్నారు. పవన్ నిత్యం ప్రశ్నిస్తానని చెబుతుంటారన్నారు. ప్రశ్నించే హక్కు నాకు, మీకు అందరికీ ఉందని చెప్పారు.
కానీ, మిమ్మల్ని ప్రశ్నించే హక్కు మాకు మీరు కల్పించారన్నారు. పవన్కు ఆంధ్రా ప్రజలు అంటే ప్రేమ అని భావించామని, వారి సంక్షేమం ముఖ్యమని భావించామని చెప్పారు. తిడితే కెసిఆర్లా తిట్టాలి లేదా పడితే సీమాంధ్ర ఎంపీల్లా పడాలని చెబుతున్నారని, అంత పౌరుషం లేకుండా ఇక్కడ ఎవరూ లేరన్నారు.
మీ అన్నయ్య చిరంజీవి ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. మీరు ఇప్పుడు సెక్షన్ 8 వద్దని చెబుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ పైన ఏపీకి అనేక రకాల హక్కులు ఉన్నాయని చెప్పారు. మన ప్రాంత ఉద్యోగులను తొలగిస్తుంటే సెక్షన్ 8 వద్దని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
మీ అన్న చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన విభజన బిల్లులో సెక్షన్ 8 ఉందని, దానిని వద్దని ఎందుకు చెబుతున్నారో తెలుసుకోవచ్చా అని ప్రశ్నించారు. ఓ ఆర్ట్ డైరెక్టర్ను యాదాద్రికి పెడితే కెసిఆర్ జాతీయవాదిగా కనిపించాడా అని ప్రశ్నించారు.
మీ ఆస్తులు కాపాడుకునేందుకు సెక్షన్ 8 వద్దని చెప్పడం విడ్డూరమన్నారు. కేశినేని నాని టిక్కెట్ కోసం 18 ఏళ్లు కష్టపడ్డాడనే విషయం తెలుసుకోవాలన్నారు. ప్రజలను మోసం చేయాలనుకోలేదన్నారు. సుజన వ్యాపారాలు చేసుకుంటున్నారని చెబుతున్నారని, కానీ ఆరు నెలలకు ఓసారి లేస్తే మీకు ఏం తెలుస్తుందన్నారు.
సుజన ఏపీకి నిధులు తీసుకు వచ్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు మండలాలను ఏపీలో కలిపించిన ఘనత సుజనది అని చెప్పారు. సుజనా చౌదరి గురించి మాట్లాడేంత గొప్పవారు మీరు కాదన్నారు. అశోక్ గజపతి రాజు గురించి తెలుసుకోవాలన్నారు.
ఎన్నో సేవలు చేసి ఈ స్థాయికి వచ్చారన్నారు. విమానాశ్రయాలు తీసుకు వచ్చారన్నారు. సీమాంధ్రుల ఇళ్లు కూల్చుతుంటే పవన్ కళ్యాణ్కు పట్టదా అన్నారు. నీ సినిమాలు ఆడిపించుకునేందుకు కెసిఆర్ను పొగడాలా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై లోకసభ, రాజ్యసభలో మా వాదం వినిపించామన్నారు.
ప్రత్యేక హోదా కోసం తోట నర్సింహం 35 సార్లు, అవంతి శ్రీనివాస్ 35 సార్లు, రాయపాటి సాంబశివ రావు 30 సార్లు ఇలా ఎంపీలు పలుమార్లు మాట్లాడారని చెప్పారు. ఏపీ కోసం ఎంపీలు ఏమేం చేశారో కేశినేని నాని సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సీమాంధ్రులకు కల్పించిన హక్కుల్లో సెక్షన్ 8 ఒకటి అన్నారు.
మేం వ్యాపారాల్లో కష్టపడి సంపాదించుకుంటున్నామన్నారు. అంతర్జాతీయంగా స్కాంలకు పాల్పడిన వారి డబ్బులతో సమావేశాలు పెట్టడం లేదన్నారు. సుజన, అశోక్ వంటి వారిపై మాట్లాడే హక్కు లేదన్నారు. విశాఖలో కొత్త విమానం అశోక్ శ్రమిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో మీ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. మీరు ప్రధాని మోడీని కలిసి ఎన్నిసార్లు ప్రశ్నించారో చెప్పాలన్నారు. మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పానని, మీరు కూడా నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ను అన్నారు. మన ఆత్మగౌరవాన్ని కెసిఆర్ కాళ్లకింద పెట్టొద్దన్నారు.
రాష్ట్రానికి రూ.8,500 కోట్లు ఇప్పించిన ఘనత సుజనకు దక్కుతుందన్నారు. పవన్తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమేనని, కానీ మా ఆత్మగౌరవాన్ని కెసిఆర్ కాళ్ల వద్ద పెడితే సహించేది లేదన్నారు.