కేశినేని ట్రావెల్స్ బాటలో మరికొన్ని..: అవి షాకిస్తున్నాయి, ఏళ్లకు ఇలా చెక్!
విజయవాడలో దిగ్గజ ప్రయివేటు ట్రావెల్స్ మూతపడుతున్నాయి. రెండున్నర దశాబ్దాల కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్ను మూసివేసినట్లు ఇటీవల ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.
విజయవాడ: విజయవాడలో దిగ్గజ ప్రయివేటు ట్రావెల్స్ మూతపడుతున్నాయి. రెండున్నర దశాబ్దాల కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్ను మూసివేసినట్లు ఇటీవల ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. కాళేశ్వరి ట్రావెల్స్ ఇంతకు ముందే మూతపడింది. ఇదే బాటలో మరికొన్ని ప్రయివేటు ట్రావెల్స్ ఉన్నాయట.
ఎత్తులు చిత్తు!: కేశినేని ట్రావెల్స్ మూసివేత వెనుక పెద్ద కథ, ఏం జరిగింది?
ఆర్టీసీకే సవాల్ విసిరిన ప్రయివేటు ఆపరేటర్లు ఇప్పుడు తమ ట్రావెల్స్ను మూసివేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా నష్టాలు అనే కారణం వినిపిస్తోంది. కేశినేని ట్రావెల్స్ ఫిబ్రవరి 1, 1992వ సంవత్సరంలో ఏర్పాటు జరిగింది. ఉమ్మడి ఏపీలోనే ప్రయివేటుగా తొలి బస్సు నిలిపిన చరిత్ర.
మొత్తం 425 షెడ్యూల్స్తో ఈ సంస్థ 75 గమ్యస్థానాలకు యాత్రికులను చేరవేసేది. మొదట్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు, ఆ తర్వాత ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు కూడా షెడ్యూల్స్ను నడుపుతూ అక్కడ కూడా తన వ్యాపారాన్ని విస్తరించింది. అయితే, ప్రధానంగా నష్టాల కారణంగానే ట్రావెల్స్ మూసివేస్తున్నారు.
రెండు దశాబ్దాల తర్వాత చెక్!
రెండు దశాబ్దాల కాలం పాటు ప్రయివేటు ట్రావెల్స్ అప్రతిహత యాత్రను సాగించాయి. ప్రయాణికులు హైఎండ్ శ్రేణిలో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బస్సులను కలిగిన ప్రైవేటు ట్రావెల్స్ వైపు ఎక్కువుగా మొగ్గు చూపేవారు. రాష్ట్ర విభజనకు ముందు కొద్దిగా కుదుపుకు గురైన ప్రయివేటు ఆపరేటర్లు, విభజన జరిగినప్పటి నుంచి సంక్షోభపు అంచునకు చేరుతున్నారు.
ఇలా ఆర్థిక భారం
ప్రయివేటు ఆపరేటర్ కాంట్రాక్టు క్యారియర్ పర్మిట్ను కలిగి ఉంటాడు కాబట్టి మోటార్ వాహనాల చట్టం, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నులు, ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. విభజన తర్వాత వేర్వేరు రాష్ట్రాల్లో ఇంటర్ స్టేట్ పర్మిట్లు తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఆర్థికంగా భారంగా మారింది.
పోటీ పెరిగింది
దీంతోపాటు కాంట్రాక్టు క్యారియర్గా నిబంధనల మేరకు బస్సులోని ప్రతి సీటుకు సీటింగ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మోయలేని భారం. దీనికి తోడు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు గత అర దశాబ్ద కాలంలో ఎక్కువుగా ప్రమాదాలకు గురవడం వల్ల ప్రయాణీకులు తగ్గుముఖం పడుతున్నారంటున్నారు. ప్రయివేటు ఆపరేటర్ల మధ్య కూడా పోటీ పెరిగింది.
దెబ్బతీసిన రవాణా శాఖలోని మార్పులు
రవాణాశాఖలో విప్లవాత్మకంగా వచ్చిన మార్పులు కూడా ప్రయివేటు ఆపరేటర్ల ఆధిపత్యానికి తెరపడుతోందన్న వాదనలు వస్తున్నాయి. గతంలో ఒకే నెంబర్ ప్లేట్ మీద అనేక బస్సులు తిరిగేవి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా నిలిచిపోయింది. చెక్ పోస్టుల దగ్గర నిఘా పెరిగింది.
కేశినేని ట్రావెల్స్పై వైసిపి ఇలా..
ఇదిలా ఉండగా, కేశినేని ట్రావెల్స్ మూసివేత వెనుక పెద్ద కథ ఉందని వైసిపి ఆరోపిస్తోంది. బ్యాంకుల నుంచి రూ.వందల కోట్లు అప్పు చేసిన కేశినేని నాని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని, బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా ఎగనామం పెట్టారని, నాని మరో విజయ్ మాల్యా అవతారం ఎత్తారని వైసిపి నేత చెవిరెడ్డి ఆరోపించారు. తమకు గ్రేడ్ కోసమే రవాణా శాఖ కార్యాలయం వద్ద ఇటీవల వివాదం జరిగిందనే వాదనలు కూడా ఉన్నాయి.