లోపలేయిస్తామని బెదిరింపులు: ఏడాదిగా జీతాలివ్వని కేశినేని ట్రావెల్స్!..
ఈ నెల 15లోగా తమకు జీతాలు ఇవ్వకపోతే ఇదే నెల 17న తమ కుటుంబాలతో సహా రోడ్డెక్కుతామని బాధిత ఉద్యోగులు తెలిపారు.
అమరావతి: అనూహ్య నిర్ణయంతో కేశినేని ట్రావెల్స్ మూతపడటంతో.. ఉన్నపలంగా ఉపాధి కోల్పోయిన ఆ సంస్థ ఉద్యోగులంతా రోడ్డున పడ్డారు. ఏడాది కాలంగా జీతాలు ఎగ్గొట్టి మరీ ఇప్పుడు ఏకంగా సంస్థను మూసివేయడంతో తమ పరిస్థితేంటని వారు నిలదీస్తున్నారు.
సోమవారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కేశినేని సంస్థ ఉద్యోగులు విజయవాడ సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకపోగా.. మూడు నెలల జీతాన్ని అదనంగా చెల్లించినట్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అక్కడకు వచ్చిన ఉద్యోగులు మండిపడ్డారు.
ఈ నెల 15లోగా తమకు జీతాలు ఇవ్వకపోతే ఇదే నెల 17న తమ కుటుంబాలతో సహా రోడ్డెక్కుతామని బాధిత ఉద్యోగులు తెలిపారు. డ్రైవర్లు, ఇతర సిబ్బంది కలిసి కేశినేని ట్రావెల్స్ ను నిలదీస్తున్నా.. యాజమాన్యం మాత్రం వీరి గోడు పట్టించుకోవడం లేదు.
కేశినేని ట్రావెల్స్ యజమాని ఎంపీ కేశినేని నాని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, ఇప్పుడు ఎవరితోను మాట్లాడేందుకు సిద్దంగా లేరని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అంతకుమంచి మాట్లాడితే పోలీసులతో లోపలేయిస్తామని వారు బెదిరిస్తున్నట్లుగా ఉద్యోగులు వాపోతున్నారు.
సంస్థ కార్యాలయం ఎదుట పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేశినేని నానికి సన్నిహితుడైన ఫణి అక్కడికి చేరుకుని డ్రైవర్లతో చర్చలు జరిపారు. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఈ నెల 15న వారి ఖాతాల్లో జీతాలు జమచేస్తామని అన్నారు. లేనిపక్షంలో 16న ఎంపీ కేశినేని నానితో చర్చకు అవకాశం కల్పిస్తామని అన్నారు. హామి నిలబెట్టుకోకుంటే ఈ నెల 17న కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు ఉద్యోగులంతా సన్నద్దమవుతున్నారు.