అందుకే 'ఎవడు'కు ఆ పేరు: చిరంజీవిపై కిల్లి అభిమానం
హైదరాబాద్/శ్రీకాకుళం: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి మరో కేంద్రమంత్రి చిరంజీవి పైన పొగడ్తల వర్షం కురిపించారు. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన ఎవడుచిత్రం విడుదల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో చిరు అభిమానుల ఆత్మీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృపారాణి పాల్గొని చిరంజీవి పైన, ఆయన కుటుంబం పైన తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తనకు అన్నయ్య చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని, ఆయనకు ఎవరు సాటిరారన్నారు. అన్నయ్య స్టెప్పులేస్తే అదిరిపోతుందన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరు చిరంజీవిని అభిమానిస్తారని చెప్పారు. కష్ట సమయంలో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి ఆక్సిజన్ అందించారని అభిప్రాయపడ్డారు.
చిరంజీవి ఫ్యామిలీకి ఎవరు సాటిరారని, దానిని చెప్పేందుకే రామ్ చరణ్ తేజ నటించిన తాజా చిత్రానికి 'ఎవడు' అని పేరు పెట్టారని తనదైన శైలిలో చెప్పారు. కిల్లి కృపారాణి మెగాస్టార్ చిరంజీవి పైన తన అభిమానాని చాటుతుంటే అభిమానులు కేరింతలు కొట్టారు.
విభజన పైనా...
అదే సమయంలో కిల్లి కృపారాణి విభజన అంశం పైనా మాట్లాడారు. విభజన విషయంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తలో మాట చెబుతున్నారని, తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దీనిని చిరంజీవి అభిమానులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.