బాలుడి కడుపులోంచి కిలో రాళ్లు వెలికి తీసిన వైద్యులు
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పదేళ్ల బాలుడి కడుపులోంచి కిలోకు పైగా రాళ్లను ఎలాంటి సర్జరీ చేయకుండా తొలగించి డాక్టర్లు అరుదైన చికిత్సను అందించారు. పాన్గల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన పదేళ్ల నవీన్కుమార్రెడ్డికి మోషన్లో రాళ్లు వస్తున్నాయని ఆసుపత్రికి వచ్చినట్లు జనరల్ సర్జన్ డాక్టర్ కిరణ్కుమార్, చిన్నపిల్లల డాక్టర్ శరత్చంద్ర తెలిపారు.
ఎక్సరే తీసి చూడగా కడుపులో చాలా రాళ్లు ఉండడాన్ని గుర్తించి వాటిని ఆపరేషన్ చేసి తీసివేయాలని డాక్టర్ల బృందం నిర్ణయించిందని చెప్పారు. ముందుగా ఆపరేషన్ లేకుండా ప్రయత్నించి తీయాలని ప్రయత్నించగా సఫలీకృతమైనట్లు తెలిపారు. మామూలుగా రక్తహీనత ఉన్నా, మానసికలోపం ఉన్నా మట్టి, చాక్పీస్లు తింటారని, నవీన్కుమార్ రెడ్డి మాత్రం గత రెండు సంవత్సరాల నుండి రాళ్లను తింటూ వచ్చాడని అన్నారు. దీంతో మలంలో కొన్ని పడిపోగా ఇంకా కిలోకు పైగా రాళ్లు కడుపులోనే ఉన్నాయని తెలిపారు.
ఎంతో జాగ్రత్తగా తన కుమారునికి ఎలాంటి ఆపరేషన్ చేయకుండా రాళ్లను తొలగించడం పట్ల చిన్నారి తండ్రి యాదిరెడ్డి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మానసిక జబ్బు కారణంగా మట్టి, చాక్పీస్లను ఆ బాలుడు మింగేవాడు. అనీమియా కారణంగానే గులకరాళ్లు మింగేవాడు. మూడు నెలల నుంచి అతడు మింగిన గులకరాళ్లు కిలో వరకు కడుపులో పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో విరేచనాల్లో రాళ్లు వస్తుండటంతో బాలుడు తీవ్ర నొప్పితో బాధపడుతుండటాన్ని గమనించిన తండ్రి యాదవరెడ్డి గురువారం గ్రామంలోని ఓ వైద్యుడికి చూపించారు. బాలుడిని పరీక్షించిన వైద్యుడు, కడుపులో రాళ్లు పేరుకుపోవడంతో బాలుడి ప్రాణానికి ప్రమాదమని చెప్పారు.
దీంతో బాలుడిని శుక్రవారం వనపర్తిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కిరణ్కుమార్, శరత్చంద్ర బాలుడిని పరీక్షించి పొత్తి కడుపు వాపు కన్పించడంతో ఎక్స్రే తీశారు. కడుపులో భారీ సంఖ్యలో రాళ్లు ఉన్నట్లు తేలింది. ఆపరేషన్ చేస్తే ప్రమాదమని గుర్తించి, విరేచనాల ద్వారానే మొత్తం రాళ్లను బయటికి రప్పించి బాలుడి ప్రాణాన్ని కాపాడారు.