రాష్ట్రపతి వద్దకు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుకు కోపమొచ్చింది
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కిరణ్ రెడ్డి సమావేశమయ్యారు.
మధ్యాహ్నం రాష్ట్రపతిని కలవనున్న గవర్నర్
రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన ప్రణబ్తో సమావేశం కానున్నారు.
రాజమండ్రిలో ఏపీ మంత్రి నారాయణ పర్యటన
ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంచినీటి సరఫరాపై సీవీ మార్కెట్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మంచినీటి సరఫరాపై ప్రజలు పలు సమస్యలు చెప్పడంతో వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
జాతీయ ఉత్సవంగా గోదావరి పుష్కరాలు
గోదావరి పుష్కరాలను జాతీయ ఉత్సవంగా నిర్వహిస్తామని, అందరూ కష్టపడి పనిచేసి విజయవంతం చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గోదావరి పుష్కర ఏర్పాట్లపై గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పుష్కరాల ఏర్పాట్లపై మూడు కమిటీలను ఏర్పాటు చేస్తామని... పుష్కరాల ఏర్పాట్లపై సమన్వయ, కార్యనిర్వాహక కమిటీలు, రాష్ట్రస్థాయిలో ఉన్నత కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
పుష్కర పనులపై నిరంతరం సమీక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. పుష్కర ఏర్పాట్లు, పనులపై చంద్రబాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరిగతిన పూర్తిచేయాలన్నారు. గోదావరి నదిపై నాలుగో వంతెన ప్రారంభించకుండానే రహదారులు దెబ్బతినడంపై నిర్మాణ సంస్థ గామన్ను తీవ్రంగా హెచ్చరించారు.