విభజన టైంలో తెరవెనుక ఏం జరిగింది: పుస్తకం ద్వారా గుట్టువిప్పనున్న కిరణ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సెంటరాఫ్ అట్రాక్షన్ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగిన కిరణ్ రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్ల సమైక్య ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ తర్వాత విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఓ ముఖ్యమంత్రిగా అధిష్టానమైన కాంగ్రెస్, సోనియా నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు కిరణ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు.
విభజన సమయంలో తెరవెనుక రాజకీయాల పైన ఆయన పుస్తకం రాయనున్నారని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారు. అలాంటి కిరణ్ ఇప్పుడు మరోసారి పుస్తకం ద్వారా సంచలనానికి కేంద్ర బిందువుగా మారనున్నారు.
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వివరాల ప్రకారం.. రాష్ట్ర విభజన సమయంలో తెరవెనుక ఎంతో మంత్రాంగం జరిగిందని చెబుతున్న కిరణ్, ఈ వివరాలను పొందుపరూస్తూ ఓ పుస్తకం రాస్తున్నారు. దాదాపు నాలుగు వందల పేజీలు ఉండే ఈ పుస్తక రచన చివరి దశకు వచ్చింది.
విభజన సమయంలో సోనియా, రాహుల్, పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలతో పాటు ఏపీ ప్రాంతీయ పార్టీల అధినేతలు అనుసరించిన ద్వంద్వ విధానాలను ఈ పుస్తకంలో ఆయన పొందుపర్చనున్నారని తెలుస్తోంది. ఏ నాయకుడు ఏం చేశారనే వాస్తవాలు ఈ పుస్తకంలో ఉండబోతున్నాయని సమాచారం.
వీటికి డాక్యుమెంటరీ ఆధారాలు కూడా ఉన్నాయని కిరణ్ చెప్పారని పేర్కొన్నారు. నాడి ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, యూపీఏ మంత్రుల చర్చల విషయాలను కూడా పుస్తకంలో పొందుపర్చనున్నారు. చంద్రబాబు విషయాన్ని కూడా ప్రస్తావించనున్నారు. ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానానికి పంపిన నివేదికలను కూడా పేర్కొంటారు.
ఎన్నికల అనంతరం కిరణ్ రెడ్డి అమెరికా వెళ్లారు. ఈ పుస్తకంలో ఎక్కువ భాగం అమెరికాలోనే రాశారు. ఎక్కువ కాలాన్ని కుటుంబంతో గడపడం, గోల్ఫ్స్ ఆడటం ద్వారా గడిపేస్తున్నారని తెలుస్తోంది. తాను రాసిన పుస్తకానికి కిరణ్ ఇంకా పేరు పెట్టలేదు.