గజ్వెల్లో కేసీఆర్ ఓడిపోతారు, ఆంధ్రా కాంట్రాక్టర్లే: కోమటిరెడ్డి సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆదివారం నాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆదివారం నాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తే తమకు 111 సీట్లు వస్తాయని కేసీఆర్ చెప్పడం ఈ శతాబ్దపు జోక్ అని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు 111 సీట్లు కాదని, మూడు పంగనామాలు పెడతారని విమర్శించారు. గజ్వెల్ నుంచి స్వయంగా కేసీఆర్ కూడా గెలవలేరని చెప్పారు. కేసీఆర్తో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు కూడా గెలవలేరని జోస్యం చెప్పారు.
టీఆర్ఎస్కు 111 సీట్లు ఖాయం: సర్వే, సెల్ఫోన్లపై కేసీఆర్
ఎన్నికల్లో గెలుస్తామనే దమ్ము ఉంటే గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయించి, తిరిగి పోటీ చేయించాలన్నారు. గుత్తా గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కోమటిరెడ్డి సవాల్ చేశారు.
గుత్తా ఓడిపోతే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఓట్లు కాదని, రాళ్లు పడతాయన్నారు. అద్దాల మేడలో ఉంటున్న కేసీఆర్కు బయటి ప్రపంచం తెలియడం లేదన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల చేతిలో తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.