సభ్యత్వం ఎవరూ తీసుకోరు: కోమటిరెడ్డి, ఓటమి కొత్త కాదన్న పొన్నాల
నల్గొండ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నల్గొండలో నిర్వహించిన తెలంగాణ డిక్లరేషన్ డే, సోనియాగాంధీ జన్మదిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొన్నాలను చూసి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకునేవాళ్లు ఎవరూ లేరని విమర్శించారు. పార్టీ సభ్యత్వ నమోదులో నల్గొండ నియోజకవర్గాన్ని ముందుంచుతానన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీపై అభిమానంతో సభ్యత్వం తీసుకుంటారని, పొన్నాలను చూసి ఎవరూ తీసుకోరని ఎద్దేవాచేశారు.
ఎన్నికలకు ముందే సిఎం కె చంద్రశేఖర్ రావు పర్యటన, ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడిన తీరుతో టీఆర్ఎస్ అధికారం చేపట్టిందన్నారు. పొన్నాలకు తిరగడం, మాట్లాడటం రాదన్నారు. కాంగ్రెస్ కోసం పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
ఓటమి కొత్తేమీ కాదు: పొన్నాల
హైదరాబాద్: అధికారానికి దూరం కావడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ ప్రజలు ఆదరించడంతో మళ్లీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 9వ తేదీని కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన దినంగా జరుపుకొంటుందని పొన్నాల తెలిపారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 68వ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్లో జరిగిన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు వివేక్, అంజన్కుమార్ యాదవ్, మాజీమంత్రులు శ్రీధర్బాబు, దానం నాగేందర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, కే జనార్దన్రెడ్డి, మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.