పెద్ద మనసు: సిఎం కెసిఆర్పై కోమటిరెడ్డి పొగడ్తలు
నల్గొండ: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమారు ప్రశంసలు కురిపించారు. సిఎం కెసిఆర్ సహకారంతో నల్గొండ జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ది పెద్ద మనసు అని వెంకటరెడ్డి కొనియాడారు. కెసిఆర్ పెద్ద మనసుతో ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించారని తెలిపారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.
త్వరలోనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా నల్గొండలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేయిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
ప్రతిపక్షాల విమర్శలు అసత్యం:ప్రభాకర్రెడ్డి
హైదరాబాద్: రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అసత్యమని టిఆర్ఎస్ ఎంపీ కొత్తకోట ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్య ఉన్న మాట వాస్తవమేనని.. విద్యుత్ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు.
ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిపోయి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వాల తప్పిదాలకు తామెందుకు బాధ్యత వహించాలని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.
రోడ్లకు త్వరలో టెండర్లు: కెటిఆర్
రంగారెడ్డి జిల్లా పంచాయతీ రోడ్ల అంశంపై శనివారం సచివాలయంలో మంత్రులు కెటి రామారావు, మహేందర్రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జిల్లాలోని కొత్త రోడ్లకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. పంచాయతీ రోడ్లకు మునుపెన్నడూ లేని విధంగా నిధులు కేటాయించామని చెప్పారు.
రోడ్ల నిర్మాణం, నిర్వహణలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. నాణ్యత బాధ్యత పూర్తిగా ఇంజినీర్లదే అని తేల్చిచెప్పారు. పనుల్లో నాణ్యత లేకుంటే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 12,039 కిలోమీటర్ల బీటీ రోడ్ల రెన్యువల్కి టెండర్లు పిలిచామని చెప్పారు.