నా భర్త ఎండి, నేనెప్పుడో తప్పుకున్నా: సిబిఐ కేసుపై ఎంపీ గీత
హైదరాబాద్: ఓ జాతీయ బ్యాంకుకు తప్పుడు పత్రాలు సమర్పించి రూ.25 కోట్ల రుణం తీసుకున్న కేసుతో తనకు ఏ విధమైన సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత స్పష్టం చేశారు.
విశ్వేశ్వర ఇన్ఫ్రాక్చర్ కంపెనీలో తనకు ఏవిధమైన హోదా లేని తనపై ఎలా చార్జిషీట్ దాఖలు చేస్తారంటూ ఆమె సిబిఐని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని చెప్పారు.
విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి తన భర్త ఎండీగా ఉన్నారని, అందులో స్వల్పకాలం పాటు తాను భాగస్వామిగా కొనసాగానని, అనంతరం, 2012లో బయటికి వచ్చానని వెల్లడించారు. అంతకుముందే 2009లో బ్యాంక్ నుంచి కంపెనీ పేరిట రుణం తీసుకున్నామని, అందుకోసం సరైన పత్రాలనే సమర్పించామని వివరణ ఇచ్చారు.
ఈ రుణాన్ని కూడా సాధ్యమైనంత త్వరలో బ్యాంకుకు చెల్లిస్తామని చెప్పారు. రాజ్యాంగం పట్ల, వ్యవస్థల పట్ల తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. నకిలీ పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.42.79 కోట్ల రుణం తీసుకున్నారంటూ ఎంపీ గీతపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ మీడియాలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.