ఖబడ్దార్ వ్యాఖ్య చిరుపై కాదు, వర్మ గొడవలోకి లాగొద్దు: క్రిష్ వివరణ
ఖబడ్డార్ అంటూ తాను చేసిన వ్యాఖ్య చిరంజీవిని ఉద్దేశించింది కాదని క్రిష్ వివరణ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ వివాదంలోకి తనను లాగవద్దని కోరారు.
హైదరాబాద్: తిరుపతిలో ఘనంగా జరిగిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుకలో భావోద్వేగపూరితంగా ప్రసంగించిన క్రిష్ చివర్లో 'ఖబడ్దార్' అనే వ్యాఖ్య చిరంజీవిని ఉద్దేశించి కాదని క్రిష్ వివరణ ఇచ్చారు. చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా, తాను దర్శకత్వం వహించిన గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతికి విడులవుతున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్య చిరంజీవిని ఉద్దేశించి చేసినట్లు వివాదం చెలరేగింది.
దానిపై వెంటనే క్రిష్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఆ వివాదంపై క్రిష్ స్పందించాడు. తాను తెలుగువాడి పౌరుషం గురించే ప్రసంగించానని, తెలుగువారిని చులకనగా చూసేవారిని హెచ్చరించే క్రమంలో ఆ పదం నా నోటి నుంచి వచ్చిందని ఆయన చెప్పారు. అయితే కొంత సమయం తర్వాత తన భార్య తనకు ఆ వివాదం గురించి చెప్పింని, దాంతో తనకు చాలా బాధనిపించిందని చెప్పారు. తర్వాతి రోజు వినాయక్గారికి ఫోన్ చేసి మాట్లాడానని చెప్పారు.
ఇలాంటివేవీ పట్టించుకోవద్దని వినాయక్ చెప్పినట్లు ఆయన తెలిపారు. నాగబాబుకు కూడా ఫోన్ చేశానని, ఆయన 'అదేంటి క్రిష్ అలా అన్నావని వార్తలు వస్తున్నాయి' అన్నారని క్రిష్ చెప్పారు. "సార్.. నేను వేరే ఉద్దేశంతో అన్న మాటలు అవి. నా గురించి మీకు తెలుసు కదా! అన్నా. ఆయన కూడా లైట్ తీసుకున్నారు. చిరంజీవిగారు నా అభిమాన హీరో. చరణ్ నాకు మంచి ఫ్రెండ్. వాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు. అయితే ఫ్యాన్స్ కోసమే ఆ తర్వాతి రోజు నేను వివరణ ఇచ్చాను" అని క్రిష్ వివరించారు.
ఇదిలావుంటే, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కథను క్లుప్తంగా క్రిష్ నోట చిరంజీవి అన్నారని క్రిష్ చెబుతున్నారు. ఈ విషయాలను క్రిష్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి చిరంజీవి వద్దకు తాను వెళ్లానని, అప్పుడు ఆయనకు కథ క్లుప్తంగా వినిపించానని, ఆయన ఈ సినిమా బాగా ఆడుతుందని అప్పుడే చెప్పారని, ఆయనతోనూ, చరణ్తోనూ తనకు మంచి అనుబంధం ఉందని క్రిష్ వివరించారు.
అలాగే బాలయ్య, చిరంజీవి కూడా సోదర భావంతో ఉంటారని, వారిద్దరూ లెజెండ్స్ అని క్రిష్ అన్నాడు. అయితే వారి అభిమానులు ఇలా వాదించుకోవడం తప్పని హెచ్చరించారు. అభిమానులకు దురభిమానం వద్దని హితువు పలికారు.
'శాతకర్ణి' సినిమాను క్రిష్ అద్భుతంగా తీశాడని, అమీర్ ఖాన్, షారూక్ ఖాన్.. క్రిష్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ట్వీట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ 'ఖైదీ నెంబర్ 150'పై వర్మ విమర్శలు చేసిన సంఘటనపై క్రిష్ స్పందించారు.'వర్మ ట్వీట్లు పెట్టడానికి కారణం మీపై ప్రేమా, 'ఖైదీనెంబర్ 150' మీదా కోపమా' అని ప్రశ్న క్రిష్కు ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది.
దీనికి క్రిష్ స్పందిస్తూ - ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, తనను అనవసరంగా అందులోకి లాగవద్దని చెప్పాడు. అలాగే తన దర్శకత్వ పనితనాన్ని ప్రశంసిస్తూ వర్మ చేసిన ఓ ట్వీట్కు ధన్యవాదాలు చెబుదామనుకున్నానని, కానీ, ఇది సరైన సమయం కాదని ఆగిపోయానని ఆయన అన్నారు.