లోకేష్ బుజ్జగింపులు: టిఆర్ఎస్ వైపే టిడిపి ఎమ్మెల్యే
హైదరాబాద్: కూకట్పల్లి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు కొనసాగించినట్లు తెలిసింది. అధికార పార్టీ అయిన టిఆర్ఎస్లో చేరేందుకు ఆయన ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు సమాచారం.
టిఆర్ఎస్లో చేరతారన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు, టిడిపి నేత నారా లోకేష్ కృష్ణారావుతో మాట్లాడినట్లు తెలిసింది. పార్టీలోనే కొనసాగాలని కృష్ణారావును లోకేష్ కోరినట్లు సమాచారం.
కాగా, చంద్రబాబును కలవాలని లోకేష్ తనతో చెప్పారని కృష్ణారావు తెలిపారు. తెలంగాణ తెలుగుదేశం ముఖ్య నేతలే సిఎం కెసిఆర్తో టచ్లో ఉన్నారని చెప్పారు. వారు తాను పార్టీ మారతానన్న స్పందించలేదని వెల్లడించారు. తెలంగాణ టిడిపి నేతలు పార్టీ మారుతున్న ముఖ్య నేతలు పట్టించుకోవడం లేదని తెలిపారు. తొలగించిన 26 కులాలను తిరిగి బీసీలో చేరిస్తే తాను టిఆర్ఎస్ పార్టీలో చేరతానని కృష్ణారావు స్పష్టం చేశారు.
అయితే తనపై నియోజకవర్గంలో సమస్యల ఒత్తిడి ఉందని కృష్ణారావు చెప్పినట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకువాలని కృష్ణారావుకు పలువురు టిడిపి నేతలు సూచించినట్లు సమాచారం.
ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో కృష్ణారావు కూడా ఆ పార్టీలో చేరితే టిఆర్ఎస్ బలం నగరంలో పెరిగినట్లవుతుంది. కాగా, తెలుగుదేశం పార్టీకి నగరంలో ఈ పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనడంలో సందేహం లేదు.