కృష్ణా జలాలు: పరిష్కరించుకోండి, రేపు నిర్ణయం(ఫోటో)
హైదరాబాద్: ఎర్రమంజిల్లోని జలసౌధలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం బోర్డు పత్రికా ప్రకటన విడుదల చేసింది. శ్రీశైలం జల వివాదంపై ఎలాంటి నిర్ణయాన్ని బోర్డు వెలువరించలేదు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల సీఎస్లకు సూచించింది. ఇరు రాష్ట్రాల వాదనలు విన్నామని త్వరలోనే తమ అభిప్రాయం చెబుతామని కృష్ణాబోర్డు తెలిపింది.
కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ పండిట్ మాట్లాడుతూ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని పేర్కొన్నారు. కృష్ణా రివర్ బోర్డు పూర్తి స్థాయి సమావేశం గురువారం ఉదయం రెండోసారి సమావేశమైంది. బుధవారం జరిగిన భేటీలో శ్రీశైలం విద్యుదుత్పాదనపై అసంపూర్తిగా సమావేశం ముగిసిన నేపథ్యంలో ఈరోజు పూర్తి స్థాయి భేటీ జరిగింది.
తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్కె జోష్, ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదిత్యానంద్, కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ పండిట్, సభ్య కార్యదర్శి ఆర్కె గుప్తా, ఇరు రాష్ర్టాల చీఫ్ ఇంజినీర్లు వెంటకేశ్వర్లు, మురళీధర్తో పాటు ఏపీ, తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారులు అగర్వాల్, విద్యాసాగర్రావు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి గోదావరి బోర్డు ఛైర్మన్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తారస్థాయికి చేరిన కృష్ణా జలాల వివాదంపై కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు టెక్నికల్ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. రెండు రాష్ట్రాలు తమతమ వాదనలను బోర్డు చైర్మన్ పండిట్ ముందు బలంగా వినిపించాయి.
జల విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని ఆంధ్రప్రదేశ్ కోరగా... ఆపేది లేదంటూ తెలంగాణ తేల్చిచెప్పడంతో గురువారం బోర్టు పూర్తిస్థాయి సమావేశం జరపాలని నిర్ణయించింది. 107 జీవో ప్రకారం శ్రీశైలంలో 854 అడుగులకు నీరు చేరుకోగానే ఉత్పత్తి నిలిపివేయాలని ఏపీ ఇంజనీర్లు ప్రస్తావించగా, 69 జీవో ప్రకారం 834 అడుగుల నీటి మట్టం వరకూ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తెలంగాణ ఇంజనీర్లు బోర్డు చైర్మన్కు తేటతెల్లం చేశారు.
విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తే 300 మెగావాట్ల విద్యుత్ను తెలంగాణకు ఇస్తామని ఏపీ అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఫుల్బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తే ఈ ప్రతిపాదనలపై చర్చిస్తామని తెలంగాణ అధికారులు చెప్పడంతో... గురువారం ఉదయం 11గంటలకు ఫుల్ బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి సమావేశాన్ని ముగించింది.