కృపామణి ఆత్మహత్య: రిమాండుకు సాయి శ్రీనివాస్, గతంలో రౌడీషీట్
ఏలూరు: సంచలనం రేపిన కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాయి శ్రీనివాస్కు గతంలోనూ నేర చరిత్ర ఉంది. పెరవలి పోలీసు స్టేషన్లో అతని పైన రౌడీషీట్ కూడా ఉంది. పెరవలి, ఉండ్రాజవరం పోలీసు స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి.
ఇటీవల పాస్ పోర్టు రెన్యూవల్ కోసం ఏలూరు నివాసిగా తప్పుడు డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్నాడు. కృపామణి కేసులో కీలక నిందితుడైన సాయి శ్రీనివాస్ను అరెస్టు చేసి, శనివారం పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. అనంతరం పొద్దుపోయాక కోర్టు ఎదుట హాజరుపర్చగా, జడ్జి అతనికి రిమాండ్ విధించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని పెరవలి వంతెన సమీపంలో అతన్ని అరెస్ట్ చేశారు. సాయి శ్రీనివాస్పై ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపులు, అక్రమ రవాణా తదితర అంశాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపిన కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన సాయి శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. తనను తన కుటుంబ సభ్యులు, సాయి శ్రీనివాస్ వ్యభిచారం చేయాలంటూ బ్లాక్మెయిల్ చేశారని, ఈ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తణుకు మండలం వేల్పూరుకు చెందిన కృపామణి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ బాధలను, కష్టాలను ఆమె స్వయంగా సూసైడ్ నోట్లో పేర్కొనడమే కాకుండా సెల్ఫీలో వీడియో తీశారు. ఈ సమాచారం బయటకు రావడంతో కృపామణి ఆత్మహత్య తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. విభిన్న వర్గాలు, ప్రజా సంఘాలు కూడా ఆమె ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కేసులో పర్యవేక్షణ చేశారు. ఈ కేసులో ఈ నెల 4వ తేదీన నిందితులైన కృపామణి తల్లిదండ్రులు, తమ్ముడు, మరో మహిళను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సాయి శ్రీనివాస్ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.
అతను ఘటన వెలుగు చూసిన వెంటనే జిల్లా నుంచి విశాఖపట్నం, అక్కడ నుంచి హైదరాబాద్కు అక్కడ నుంచి పూణెకు తన మకాం మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇతన్ని అరెస్టు చేసేందుకు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పర్యవేక్షణలో మొత్తం తొమ్మిది టీమ్లను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టారు. చివరకు అతనిని అరెస్టు చేశారు.