కృపామణి ఆత్మహత్య: నోరు విప్పని సాయి శ్రీనివాస్, వ్యభిచార గృహాలకు అమ్మాయిలు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో కృపామమి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పోలీసు సబ్ డివిజన్లోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో అతన్ని ఉంచి పోలీసులు అత్యంత గోప్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.
ప్రత్యేక బృందాలు అతన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతను పరారయ్యాడు. కొంత కాలం ముంబైలో తలదాచుకున్నాడు. పోలీసులు అతని బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. దాంతో తన వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో బ్యాంకు ఖాతాలు సీజ్ కావడంతో ఎటిఎం నుంచి డబ్బులు రాకపోవడంతో సాయి శ్రీనివాస్ ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు.
అప్పటికే అతని కోసం గాలిస్తున్న పోలీసులు ముంబై చేరుకున్నారు. ఆ సమయానికి అతను హైదరాబాద్ చేరుకున్నాడని తెలియడంతో ప్రత్యేక బృందం అతన్ని హైదరాబాదులో అదుపులోకి తీసుకుంది. శ్రీనివాస్ నెట్ వర్క్ ఆధారంగా పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ నెల 25వ తేదీన అతన్ని జంగారెడ్డిగూడెం తీసుకుని వచ్చి పోలీసులు విచారిస్తున్నారు.
విచారణాధికారులు ఎంతగా ప్రశ్నించినా సాయి శ్రీనివాస్ నోరు మెదపడం లేదని సమాచారం. నోరు విప్పితే చాలా మంది పోలీసులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. తాను ఇరుక్కున్నాను కాబట్టి తానే దాన్ని భరించాలని, ఇతరుల పేర్లు చెప్పకూడదని అతను నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
ఇదిలావుంటే, వ్యభిచార గృహాలు నిర్వహించేవారు సాయి శ్రీనివాస్ ద్వారా అమ్మాయిలను తీసుకుని వెళ్లేవారని తెలుస్తోంది. ఈ వృత్తిలో అతను బాగా సంపాదించినట్లు కూడా చెబుతున్నారు. ఒక్కో అమ్మాయితో మూడు నెలల పాటు రూ. లక్ష చెల్లించే విధంగా కాంట్రాక్టు కుదుర్చుకుని ముంబై తరలిస్తాడని అంటున్నారు. కృపామణి దానికి అంగీకరించకపోవడంతో డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఒత్తిడి తెచ్చాడని అంటున్నారు.
దాంతో కృపామణి తల్లిదండ్రులు లక్ష్మీరామలింగేశ్వర రావులు తమ కూతురు కృపామణిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే, సాయి శ్రీనివాస్ను ఎక్కడ విచారిస్తోంది చెప్పడానికి పోలీసులు అధికారులు సిద్ధంగా లేరు.