మహానాడు: 'ఏపీలో పెడితే తంతారనే', 'చింతచచ్చినా పులుపు చావలేదు'
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మహానాడు పెడితే అక్కడి ప్రజలు తంతారనే హైదరాబాద్లో పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటోన్న చంద్రబాబు గతంలో హైదరాబాద్లో జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు.
తాను, ఎంపీ కవిత, మంత్రి హారీష్రావులను ప్రజలు ఎన్నుకుంటేనే నాయకులమయ్యామని అన్నారు. తెలంగాణతో ప్రజల కల నెరవేరిందని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారు. సీఎం కేసీఆర్ మహావృక్షమని, ఆయన నాయకత్వంలో తామంతా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
చంద్రబాబుకు చింతచచ్చినా పులుపు చావలేదు: జూపల్లి
చంద్రబాబుకు చింతచచ్చినా పులుపు చావలేదని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. సమాజానికి అవనీతిని పరిచయం చేసింది ఏపీ సీఎంయేనని అన్నారు. సీఎం పదవి కోసం వైశ్రాయ్ హోటల్ లో ఎమ్మెల్యేలను కొన్న ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. చంద్రబాబుది రెండు దొంగకళ్ల సిద్ధాంతమని అన్నారు.
సెంటిమెంట్ శాశ్వతం కాదని బాబు అంటున్నారు, చంద్రబాబు శాశ్వతమా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాపై చర్చకు సిద్ధమని అన్నారు. ఓయూలో ఇళ్లు కడుతుంటే గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఓయూ భూములపై మాట్లాడే హక్కు విద్యార్ధులకు మాత్రమే ఉందని పేర్కొన్నారు.
అభివృద్ధిపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు తామెప్పుడూ సిద్ధమేనంటూ జూపల్లి ఈ సందర్భంగా సవాల్ విసిరారు.