ఇటుకలు విసిరితే రాళ్లతో జవాబు: విపక్షాలపై కెటిఆర్
హైదరాబాద్: ప్రతిపక్షాలు తమపైకి ఇటుకలు విసిరితే తాము రాళ్లతో సమాధానం చెప్తామని తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ మంత్రి కెటి రామారావు అన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తే తాము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని అంటూనే ఆయన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ దశ, దిశ నిర్దేశించే విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని ఆయన శనివారం మీడియాతో అన్నారు. వచ్చే ఐదేళ్ల కాలానికి ప్రాధాన్యతలు నిర్దేశించే విధంగా బడ్జెట్ ఉంటుందని ఆయన అన్నారు. తమ జీవన ప్రమాణాలు బాగుపడుతాయని తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ఉంటుందని అన్నారు. ప్రతిపక్షాలు తమను బద్నాం చేయడానికి, మసి పూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నిస్తే ఎదుర్కునే సత్తా తమకు ఉందని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.
అన్ని ప్రశ్నలకూ తాము సమాధానం చెబుతామని, అన్ని సమస్యలపై సానుకూలంగా ప్రతిస్పందిస్తామని, ప్రజలకు జవాబుదారీగా ఉంటామని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైనవారే ఈ రోజు మాట్లాడుతున్నారని ఆయన ప్రతిపక్షాలను తప్పు పట్టారు. టిడిపి, కాంగ్రెసు నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంతగా వారి ఆరోగ్యానికి మంచిదని కెటిఆర్ అన్నారు. శ్రీశైలం నీటి విషయంపై సంబంధిత మంత్రి హరీష్ రావు చెప్పారని, ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షిస్తారని ఆయన చెప్పారు.
రాష్ట్ర బడ్జెట్ అద్భుతంగా ఉండబోతుందని, కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలపై బిజెపి నేతలే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. నలబై నిమిషాల్లో చేయాల్సిన పనిని నాలుగు నెలల పాటు నానుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.
తమను సంప్రదించకుండా తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం, హైదరాబాద్పై గవర్నర్ పెత్తనం తదతిర అంశాలను బిజెపి నేతలు గమనించి మాట్లాడితే మంచిదని ఆయన అన్నారు.